
కారు ప్రమాదంలో ఇద్దరు మృతి
సుల్తానాబాద్ సమీపంలో ఘటన
మృతులు రామగుండం వాసులు
కరీంనగర్: వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. ఎవరికి ఆపద వచ్చినా సహకరించుకుంటారు.. సుఖదుఃఖాలనూ పంచుకుంటారు.. చివరకు మరణంలోనూ ఇద్దరూ కలిసే వెళ్లారు.. హృదయం ద్రవింపజేసిన ఈ ఘటన రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో మహమ్మద్ గౌస్(34), షేక్ ఇమ్రాన్(28) దుర్మరణం చెందారు. ఎస్సై శ్రావణ్కుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రామగుండానికి చెందిన మహమ్మద్గౌస్ ఎన్టీపీసీలో జీమ్ ట్రైనర్. విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నాడు. ఈక్రమంలో వీసా దరఖాస్తు చేసేందుకు తన ఇంటిసమీపంలో ఉండే స్నేహితుడు, కారు డ్రైవర్ షేక్ ఇమ్రాన్తో కలిసి బంధువుల కారులో గురువారం ఉదయం హైదారాబాద్ వెళ్లారు.
అక్కడ పనులు పూర్తిచేకుని రాత్రివేళ బయలు దేరారు. శుక్రవారం తెల్లవారుజామున సుల్తానాబాద్ చేరుకున్నారు. ఇక్కడి రాజీవ్ రాహదారిపై ఆగిఉన్న లారీని అదుపుతప్పి వెనకాల ఢీకొన్నారు. తీవ్రగాయాలైన ఇమ్రాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్గౌస్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. మహమ్మద్ గౌస్ కారు నడుపుతుండగా ఇమ్రాన్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఆగిఉన్న లారీని ఢీకొట్టగా రెండు బెలూన్స్ తెరుకున్నాయి. అయినా, ఇద్దరి ప్రాణాలు దక్కలేదు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. గౌస్కు భార్య, పాప(4), బాబు(1.5) ఉన్నారు. ఇమ్రాన్కు ఇంకా పెళ్లికాలేదు.
‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు పనిపూర్తయ్యింది..’
రామగుండం: ‘నాన్న.. సౌదీ వెళ్లేందుకు అవసరమైన వీసా పనిపూర్తయ్యింది.. నాలుగైదు రోజుల్లో వీసా వస్తుంది..’ అని తన తండ్రి పాషాతో ఫోన్లో మాట్లాడిన మహ్మద్ గౌస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మహ్మద్ గౌస్ ఉరఫ్ నిసార్ బాడీబిల్డర్. స్థానికంగా పలు వ్యాపారాలు నిర్వహించినా నష్టాలు వచ్చాయి. దీంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ కారులో వెళ్లి వీసాకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసుకుని తండ్రి పాషాతో మాట్లాడారు. అంతలోనే సుల్తానాబాద్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదే ప్రమాదంలో చనిపోయిన ఇమ్రాన్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
నాలుగు నెలల్లో నలుగురు స్నేహితులు..
పట్టణానికి చెందిన ఎండీ గౌస్, ఇమ్రాన్, షేక్ అఫ్సరొద్దీన్, సయ్యద్ ఇమ్రాన్ నలుగురూ మంచి స్నేహితులు. వీరిలో సయ్యద్ ఇమ్రాన్ గతేడాది అక్టోబర్ 8న అంతర్గాం గోదావరి నది ఒడ్డున స్నేహితులతో కలిసి విందు చేసుకునే క్రమంలో ప్రమాదవాశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. అదే ఏడాది డిసెంబర్ 24న షేఖ్ అఫ్సరొద్దీన్ ద్విచక్ర వాహనంపై రామగుండం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కరీంనగర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నలుగురు మంచిస్నేహింతులు నా లుగు నెలల్లోనే కానరానికి లోకాలకు వెళ్లడం వారి కుటుంబాన్ని తీరని విషదం నింపినట్లయ్యింది.
అంత్యక్రియలకు హాజరు
రామగుండం: మృతుల అంత్యక్రియలు శుక్రవారం పట్టణంలో నిర్వహించారు. వీటికి ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ హాజరయ్యారు. మృతుల కుటుంబీకులను పరామర్శించారు.