బావిలో పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణ పరిధిలోని 3వ వార్డు రంగధాంపల్లి గ్రామంలోని పాఠశాల సమీపంలోని ఓ బావిలో ప్రమదవశాత్తు పడిన వ్యక్తిని గ్రామస్తుల సహకారంతో బయటకు తీసినట్టు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్టు శుక్రవారం ఉదయం గుర్తించిన స్థానికులు బ్లూకోట్ సిబ్బంది శ్రీనివాస్, వినోద్లకు సమాచారం అందించారు.
వారు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్రేన్ ఉపయోగించి బావిలో పడిన వ్యక్తిని బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతని వివరాలు ఆరా తీయగా తమది సిద్దిపేట పట్టణంలోని బారాఇమాం చౌరస్తా ప్రాంతానికి చెందిన కొండపాక కనకయ్యగా తెలిపారు. పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.