TG: నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె | Telangana Rtc Workers Ready For A Strike | Sakshi
Sakshi News home page

TG: నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె

Apr 21 2026 8:02 AM | Updated on Apr 21 2026 10:29 AM

Telangana Rtc Workers Ready For A Strike

సాక్షి, హైదరాబాద్‌: నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకే కార్మిక సంఘాలు మొగ్గు చూపుతున్నాయి. పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపుపై ఉద్యోగులు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. సమ్మె నిర్ణయంతో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. కాగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కార్ దృష్టి పెట్టింది.

మరో సకల జనుల సమ్మెలాగా  చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ నెల 22వ తేదీ నుండి సమ్మెకు దిగుతామని ప్రకటించిన నేపధ్యంలో.. 21వ తేదీ లోపు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించేందుకు అంగీకరించకపోతే సమ్మె విషయంలో వెనకడుగు వేసేది లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.

మరో సకల జనుల సమ్మెలాగా కార్యరూపం దాల్చుతుందని.. ప్రైవేట్ సిబ్బందితో తమ సమ్మె నిర్వీర్యం చేయాలని చూస్తే ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసు అంటూ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న హెచ్చరించారు. అన్ని యూనియన్ల జేఏసీలు, జేఏసీలో లేని కార్మికులు సైతం సమ్మెకు మద్దతు ఇస్తున్నాయని, ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే 22వ తేదీ మొదటి షిఫ్ట్ నుండి సమ్మె మొదలవుతుందని కార్మిక సంఘాలు అంటున్నాయి.

కాగా, ఆర్టీసీలో సమ్మె ప్రారంభానికి కేవ­లం ఒకేరోజు మిగిలి ఉన్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవటం ప్రయాణికుల్లో ఉత్కంఠ నెలకొంది. 22వ తేదీ తెల్లవారుజాము తొలి సరీ్వ­సు నుంచి సమ్మె ప్రారంభమవుతుందని ఆర్టీసీలోని ఓ జేఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు మరో జేఏసీ కూడా సమ్మెకు మద్దతు ప్రకటించింది.

సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభు­త్వం నుంచిగానీ, ఆర్టీసీ అధికారుల నుంచి గానీ చర్చ­ల­కు పిలుపు రాలేదు. ఆర్టీసీలో అధికారికంగా కార్మిక సంఘాలు లేనందున చర్చలకు సిద్ధం కాలేదు. కార్మిక సంఘాలకు నేతృత్వం వహిస్తున్న నేతల్లో ఇద్దరుముగ్గురు తప్ప మిగతా అంతా ఉద్యోగ విరమణ చేసిన వారే. దీనిని కూడా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇది కూడా చర్చలకు సానుకూలత కల్పించలేదన్న భావనా ఉంది. తాను చర్చలకు నిరంతరం సిద్ధంగానే ఉంటానని, కార్మికులెవరైనా వచ్చి తనతో మాట్లాడవచ్చని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పదేపదే ప్రకటించినా... సమ్మె నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు ఆయనతో మాట్లాడేందుకు వెళ్లలేదు.

ఇప్పటికిప్పుడు సమ్మె ప్రకటన చేయొద్దని భావించిన రెండో జేఏసీ పలు దఫాలు పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయి, కారి్మకుల దీర్ఘకాల డిమాండ్లపై సానుకూల ప్రకటన చేయా లని లేని పక్షంలో తాము కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సోమవారం ఉద­యం కూడా వెళ్లి కలిసి మాట్లాడినా సానుకూల ప్రకట­న రాలేదని పేర్కొంటూ, తాను కూడా సమ్మెకు సిద్ధ­మని ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం వర­కు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే 22 తొలి సర్వీసు నుంచి సమ్మెకు దిగుతామని ఆ జేఏసీ ప్రకటించింది.

 ఆర్టీసీ స‌మ్మెకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్

ఇప్పుడు రెండు జేఏసీలు సమ్మె విషయంలో ఏకం కావటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి వరకు సమ్మె విషయంలో స్పందించలేదు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా ఎలాంటి నిర్ణయం తెలపలేని పరిస్థితి నెలకొంది. మంగళవారం వేతన సవరణ సహా కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల ప్ర­క­టన చేయటం ద్వారా కార్మికులను ఒప్పించి సమ్మెకు దిగకుండా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ చేయాలనే డిమాండ్‌తో రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీతో జరిపిన చర్చల్లో ఎలాంటి ఫలితం లేనందున ఈ నెల 22 నుంచి తలపెట్టిన సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.హనుమంత్‌ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు తెలిపారు. సోమ­వారం విద్యానగర్‌లో నిర్వహించిన సన్నాహక సమా­వేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేనందున సమ్మెలో భాగస్వాములం అవుతున్నామని వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement