
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు శుభపరిణామం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామం. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్లు రిజర్వేషన్ల అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఎనిమిదో తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాము. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలి’ అని కోరారు.
మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..‘ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ కొట్టేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. రిజర్వేషన్ల కోసం జీవో కూడా విడుదల చేశాం’ అని చెప్పుకొచ్చారు.