
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్లో నిర్వహించిన మెగాజాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ఎంకే నాయుడు ఫంక్షన్ హాలఖలో నిర్వహించిన జాబ్ మేళాకు యువత భారీగా తరలి రావడంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. గేట్ తీయగానే నిరుద్యోగులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురు నిరుద్యోగ మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మంత్రి కొండా సురేఖ జాబ్ మేళాను ప్రారంభించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరిగింది.

కాగా, 60 కంపెనీల ద్వారా 11 వేల మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో కొండా దంపతులు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.

ఎన్నికల ముందు చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విధంగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని గత పది సంవత్సరాలలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగాలు లేకుండా పోయాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని, ప్రతిఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని.. అందుకే జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని కొండా సురేఖ చెప్పారు.