కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు | Secunderabad: Bomb Threat Call To Krishna Express Train | Sakshi
Sakshi News home page

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

Jan 21 2023 1:38 AM | Updated on Jan 21 2023 5:17 AM

Secunderabad: Bomb Threat Call To Krishna Express Train - Sakshi

మౌలాలి రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీలు, నిందితుడు కిరణ్‌కుమార్‌   

సికింద్రాబాద్‌: తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఆదిలాబాద్‌ వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రూట్‌లో బాంబు ఉందని ఓ యువకుడు చేసిన ఆకతాయి ఫోన్‌ సందేశం శుక్రవారం రాత్రి కలకలం సృష్టించింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాంబు ఉందని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక అది పేలుతుందని ఆకతాయి పంపిన మెసేజ్‌తో ఇటు జీఆర్‌పీ, అటు ఆర్‌పీఎఫ్‌ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.45 గంటలకు చేరుకోవాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు గంట ఆలస్యంగా నడుస్తుంది. 8 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి రాచకొండ పోలీసులకు ఫోన్‌ చేసి బాంబు ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే మౌలాలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైలును అదే స్టేషన్‌లో నిలిపి సోదాలు నిర్వహించారు. అదే సమయంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న  బాంబ్‌  స్వా్వడ్‌ బృందాలు తనిఖీల అనంతరం ఆకతాయి పనిగా నిర్థారించారు. రెండు గంటలు ఆలస్యంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆ మీదట ఆదిలాబాద్‌కు బయలుదేరి వెళ్లింది.  

రైలులో ప్రయాణిస్తూనే .. 
మహబూబాబాద్‌కు చెందిన కిరణ్‌కుమార్‌ అనే యువకుడు అదే రైలులో ప్రయాణిస్తూ పోలీసులకు సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌ చేశాడు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో అరాచక శక్తులు ప్రయాణిస్తున్నాయని వారు రైలును పేల్చే ప్రయత్నం చేస్తున్నారని మెసేజ్‌లో పేర్కొన్నాడు. ఒక వైపు తనిఖీలు చేస్తూనే మరోవైపు మెస్సేజ్‌ అందిన ఫోన్‌ నెంబర్‌ సిగ్నల్‌ ఆధారంగా సందేశం పంపిన వ్యక్తి అదే రైలులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  ఇన్‌స్పెక్టర్‌ పరీక్షకు హాజరై సెలక్ట్‌ కాలేదన్న ఆక్రోశంతో మెసేజ్‌ చేసినట్లే నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement