నాటి జ్ఞాపకాలు.. నేటి ఆనందబాష్పాల్లో... 50 ఏళ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం!  | saint pauls school 1972 batch reunion at hyderabad | Sakshi
Sakshi News home page

నాటి జ్ఞాపకాలు.. నేటి ఆనందబాష్పాల్లో... 50 ఏళ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం! 

Dec 29 2022 1:14 AM | Updated on Dec 29 2022 3:50 PM

saint pauls school 1972 batch reunion at hyderabad - Sakshi

1972 బ్యాచ్‌ టెన్త్‌ విద్యార్థులకు అటెండెన్స్‌ తీసుకుంటున్న సైన్స్‌ టీచర్‌ షకీనా

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): ‘‘ఏరా ఉదయ్‌ నువ్వేం మారలేదు. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావురా, హేయ్‌ కేఆర్‌పీ చాలా రోజుల తర్వాత చూడటం హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా చాలా యంగ్‌ ఉన్నావ్‌రా, రేయ్‌ నరోత్తమ్‌..క్యా బాత్‌హేబై బోత్‌ దిన్‌ కా బాద్, జయంత్‌ నీ అప్‌డేట్స్‌ అన్నీ వాట్సప్‌ స్టేటస్‌లలో చూస్తూనే ఉన్నారా’’ అంటూ 50ఏళ్ల తర్వాత నేరుగా కలిసిన ఆ పూర్వ విద్యార్థులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ భావోద్వేగానికి గురైన సంఘటన హైదర్‌గూడలోని సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్లో జరిగింది.

ఒకరిపై మరొకరు సైటైర్లు, ఇతర స్కూల్లో అమ్మాయిలకు రాసిన లవ్‌ లెటర్స్, క్రికెట్‌ స్కోర్‌ కోసం స్కూల్‌ నుంచి పారిపోయిన సందర్భం, బస్టాప్‌లో నచ్చిన అమ్మాయికి సైట్‌ కొట్టే తుంటరి చేష్టలను నెమరువేసుకున్నారు. ఆనాటి సంఘటనలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ తరగతి గది వాతావరణాన్ని తెచ్చారు 1972 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థులు.

ఈ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఇక్కడ టెన్త్‌ చదివి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా బుధవారం స్కూల్లో గోల్డెన్‌ జూబ్లీ రీయూనియన్‌ను నిర్వహించగా.. 108 స్టూడెంట్స్‌లో 64 మంది హాజరయ్యారు. వీరితో పాటు అప్పుడు పాఠాలు బోధించిన టీచర్స్‌ రసూల్, కష్ణమూర్తి, మారెడ్డి, షకీనా, ఐరీన్, కిటీ, మెజీలను సైతం ఆహ్వానించారు. స్టూడెంట్స్‌ అంతా అప్పట్లో యూనిఫాం అయిన బిస్కెట్‌ కలర్‌ ప్యాంట్, వైట్‌కలర్‌ షర్ట్‌ను ధరించి ఉదయం 10 గంటలకు క్లాస్‌రూంలోకి అడుగుపెట్టారు.

టెన్త్‌–సి క్లాస్‌ రూంలో వీరందరికీ సైన్స్‌ టీచర్‌ షకీనా క్లాస్‌ తీసుకున్నారు. రోల్‌నంబర్‌తో పిలుస్తూ..బ్యాగులు లేకుండా క్లాస్‌కు ఎందుకు అటెండ్‌ అయ్యారంటూ సరదాగా ఆటపట్టించారు. ఉదయ్‌కుమార్‌ నాయుడు, సేష్‌ నారాయణ్, కేఆర్‌పీ రెడ్డి, జితేన్‌కుమార్, అశోక్‌నాథ్, సీఎస్‌ రావు, జయంత్, నరోత్తమ్‌రెడ్డి తదితరులు తరగతి గదిలో కూర్చుని ఉండగా.. వీరిలో కొందరి సతీమణులు స్టూడెంట్స్‌గా కూర్చున్న భర్తల్ని ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సందడి వాతావారణాన్ని తెచ్చారు.



స్కూల్‌కు 27 లక్షలు సాయం
నేను ఈ స్కూల్లోనే చదివాను. 50 ఏళ్ల తర్వాత మేం కలిసిన ఈ సుభ సందర్భాన నా వంతుగా స్కూల్‌కు రూ.27లక్షలు డిపాజిట్‌ చేస్తున్నాను. దీనిలో రూ.18లక్షలు ఇక్కడ స్కూల్లో ఉన్న పేద విద్యార్థుల చదువు నిమిత్తం, రూ.9 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వినియోగిస్తాం.
– డి.జయంత్, 1972 స్టూడెంట్‌


 
నా బాధలు పోయాయి
కల్లా కపటం లేకుండా ఉండి నేడు ఉన్నత స్థానాలకు ఎదిగిన మీరంతా ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉంది. ఈ వేదికపై 50 ఏళ్ల క్రితం మీకు పాఠాలు చెప్పిన మమ్మల్ని ఆహ్వానించడం అభినందించదగ్గ విషయం. ఈ వయసులో ఎన్నో బాధలు, సమస్యలతో సతమతం అవుతున్న మాకు మిమ్మల్ని చూడగానే బాధలన్నీ పోయాయి.
– మారెడ్డి, తెలుగు టీచర్‌

Advertisement
 
Advertisement
Advertisement