సాక్షి,నల్గొండ: జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్నకారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు ఒక కారు బయలుదేరింది. పెద్దకాపర్తి సమీపంలోకి రాగానే, అదే మార్గంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో బస్సు డ్రైవర్తో పాటు ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిట్యాల పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టంపై బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతుల పూర్తి వివరాల కోసం దర్యాప్తు జరుపుతున్నారు. ప్రైవేట్ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.


