అడిషనల్‌ డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ | President Police Medal to Additional DG Vijaykumar | Sakshi
Sakshi News home page

అడిషనల్‌ డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌

Aug 15 2023 1:18 AM | Updated on Aug 15 2023 1:23 AM

President Police Medal to Additional DG Vijaykumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ / న్యూఢిల్లీ: పోలీస్‌శాఖలో విశిష్ట సేవలకుగాను సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ ఆపరేషన్స్‌ అడిషనల్‌ డీజీ విజయ్‌కుమార్, సంగారెడ్డి ఎస్పీ మదాడి రమణకుమార్‌లకు కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పోలీస్‌ పతకాలు దక్కాయి. ఈ ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకం (ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ ఫర్‌ డిస్ట్వ్ గిష్డ్‌ సర్విస్‌) కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 954 మందికి పోలీస్‌ పతకాలు సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీటిలో ఒకరికి రాష్ట్రపతి పోలీస్‌ శౌర్యపతకం, 229 మందికి పోలీస్‌ శౌర్యపతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 642 మందికి ప్రతిభా పోలీస్‌ పతకాలు దక్కాయి.  

విజయ్‌కుమార్‌ : తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో పోలీస్‌ పతకాలు దక్కిన వారిలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ 1997 బ్యాచ్‌ ఐపీఎస్‌కు చెందినవారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌ అ డిషనల్‌ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన గతంలో కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్‌పై ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్‌ సిటీ, మాదాపూర్‌ డీసీపీగా, కడప, నల్లగొండ జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు.  

రమణకుమార్‌: రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకం దక్కిన మరో అధికారి మదాడి రమణకుమార్‌ ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలంపాటు ఏసీబీలో పనిచేశారు. 

  • కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌లో పనిచేస్తున్న ఎస్పీ భాస్కరన్‌కు పోలీస్‌ శౌర్య పతకం దక్కింది. భాస్కరన్‌ సహా మొత్తం 22 మందికి పోలీస్‌ శౌర్య పతకాలు(పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలెంట్రీ–పీఎంజీ) , ఉత్తమ ప్రతిభా పోలీస్‌ పతకాలు (పోలీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) పది మందికి దక్కాయి.

నలుగురు జైలు అధికారులకు కూడా...  
నలుగురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్‌ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్‌ చెరుకూరి విజయ, అసిస్టింట్‌ డిప్యూటీ జైలర్‌ సీ.హెచ్‌.కైలాశ్, హెడ్‌వార్డర్‌ జి.మల్లారెడ్డిలు ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు.  

  • జహీరాబాద్‌ ఫైర్‌స్టేషన్‌కు చెందిన లీడింగ్‌ ఫైర్‌మ్యాన్‌ శ్రీనివాస్‌కు ఫైర్‌ సర్విస్‌ ప్రతిభా పురస్కారం దక్కింది.  
  • హోంగార్డులు కె.సుందర్‌లాల్, చీర్ల కృష్ణ సాగర్‌లకు హోమ్‌గార్డ్స్‌ – సివిల్‌ డిఫెన్స్‌ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది.  వీరిద్దరూ బీచ్‌పల్లి వద్ద కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించడంతో ఈ అవార్డుకు ఎంపిక చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement