ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. ‘గిరిజన పల్లె’ ముస్తాబు.. | Pre-wedding shoot: Tribal village in Bhadrachalam | Sakshi
Sakshi News home page

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. ‘గిరిజన పల్లె’ ముస్తాబు..

Apr 5 2025 5:36 AM | Updated on Apr 5 2025 5:36 AM

Pre-wedding shoot: Tribal village in Bhadrachalam

భద్రాచలంలోని గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఆదివాసీ జీవితాన్ని ప్రతిబింబించే థీమ్‌తో సెట్‌

ఆదివాసీ సంప్రదాయ దుస్తులు, కొమ్ముకోయ తలపాగ, వాయిద్యాలు.. ఇలా గిరిజన పల్లెను ప్రతిబింబించే థీమ్‌తో భద్రా చలంలోని గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఓ సెట్‌ రూపుదిద్దుకుంటోంది. హంగూ ఆర్భాటాలకు దూరంగా పూర్తిగా ఆదివాసీల జీవితాన్ని పరిచయం చేయబోతున్నారు. నిర్మాణ దశలో ఉండగానే ఈ పల్లెకు ఆదరణ వస్తున్న నేపథ్యంలో మరిన్ని సదుపాయాల కల్పనకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గిరిజన సంస్కృతికి ప్రాచుర్యం కలి్పంచడమే ప్రధాన లక్ష్యం కావడంతో నామమాత్రపు రుసుముతోనే పర్యాటకులు, ఫొటో, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లకు వచ్చే వారికి ప్రవేశం కల్పించనున్నారు. భద్రాచలంలో సీతారాముల దర్శనానికి వచ్చే భక్తులకు గోదావరి తీర ప్రాంత గిరిజన సంప్రదాయాలను పరిచయం చేయాలనే ఆలోచనతోనే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వచ్చే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ మ్యూజియం, గిరిజన పల్లెను ప్రారంభించేలా ఐటీడీఏ పీఓ రాహుల్‌ నేతృత్వాన ఏర్పాట్లు ముమ్మరం చేశారు.     – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

ముక్కోటితో మొదలు
జనవరిలో భద్రాచలంలో జరిగిన ముక్కోటి సందర్భంగా ‘ఏరు’పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గడ్డి గుడిసెలు, మంచె, మట్టి ఇళ్ల నమూనాలను ఐటీడీఏ క్యాంపస్‌లో ఉన్న ట్రైబల్‌ మ్యూజియం ఆవరణలో నిర్మించారు. భద్రాచలం వచి్చన భక్తులను ఈ గడ్డి గుడిసెలు ఆకట్టుకున్నాయి. వీటి ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. దీంతో ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న గిరిజన మ్యూజియాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

ఆబాల గోపాలం
గిరిజన మ్యూజియం ఆవరణలో పిల్లల కోసం ప్రత్యేకంగా బోటింగ్, ప్లే ఏరియా, యువకుల కోసం బాక్స్‌ క్రికెట్, శాండ్‌ వాలీబాల్, ఆర్చరీ గేమ్, ఓపెన్‌ జిమ్‌లు నిర్మించారు. ఆదివాసీ రుచుల నుంచి చైనీస్‌ వంటకాలతో కూడిన ఫుడ్‌ కోర్టు కూడా రెడీ చేశారు. మరోవైపు మ్యూజియాన్ని గిరిజనుల పండుగలు, వేటలో ఉపయోగించే ఆయుధాలు, ఇళ్లలో వినియోగించే పనిముట్లు, కళాకృతులు, వాయిద్యాల థీమ్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వెరసి మూడు నెలల్లోనే గిరిజన మ్యూజియం ‘మినీ స్టూడియో’గా మారిపోయింది. 

ఓవైపు నిర్మాణ పనులు జరుగుతుండగానే.. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం కాబోయే వధూవరులు, బర్త్‌డే పారీ్టల కోసం గ్రూపులు గ్రూపులుగా స్థానికులు ఇక్కడికి రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే వెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించుకునేలా మరిన్ని సదుపాయాలు జత చేయాలని నిర్ణయించారు. ఇక గిరిజన మ్యూజియం చూడాలనుకునే విద్యార్థుల కోసం స్కూలు మొత్తానికి కేవలం రూ.500 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement