
హౌసింగ్ ఏఈపై ఆగ్రహించిన
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి
గీసుకొండ: మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, శాయంపేట హవేలి, మరియపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్వనాథపురం గ్రామంలో లబ్ధిదారుడు మూడు నర్సింహకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలిస్తూ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పది మందికి ఇళ్లు మంజూరు కాగా, నలుగురు మాత్రమే ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించడంతో సంబంధిత ఏఈ వినోద్ను వివరణ కోరారు.
అందులో ఒకరి ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ కావడంతో జాప్యం జరిగిందని ఏఈ వివరణ ఇస్తుండగా, ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. ‘నీ వయస్సు ఎంత’ అని ఏఈని ప్రశ్నించగా.. 28 ఏళ్లు అని చెప్పాడు. ఇడియట్ ముచ్చట్లు చెప్పకు డీఈకి ఫోన్ చెయ్ అంటూ పరుష పదజాలంతో ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ వచ్చిన 45 రోజుల్లో బేస్మెంట్ వరకు నిర్మాణం చేపట్టాలని, లేకుంటే అవి రద్దవుతాయని అన్నారు. నిర్మాణాల విషయంలో జాప్యం జరిగితే పంచాయతీ కార్యదర్శి, సంబంధిత ఏఈలకు మెమోలో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కొమ్మాలలో కాంగ్రెస్ నాయకులకు చెందిన ఒకే కుటుంబానికి రెండు ఇళ్లు మంజూరైనట్లు స్థానికులు తెలపగా, జక్కుల రాజ్కుమార్, సాయిలి రమాదేవికి మంజూరు చేసిన ఇళ్లను వెంటనే రద్దు చేయాలని అధికారులను ప్రకాశ్రెడ్డి ఆదేశించారు.
కొమ్మాలలో ప్రజా గ్రంథాలయానికి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్థలం కేటాయించాలని, సెర్ప్ మహిళా సంఘాలకు డైరీ ఫాం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎండీ.రియాజుదీ్దన్, ఎంపీడీఓ పాక శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు శంకర్రావు, ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు దూల వెంటేశ్వర్లు, వీరాటి రవీందర్రెడ్డి, కూసం రమేష్, కొమ్ము శ్రీకాంత్, నాగరాజు, సాయిలి ప్రభాకర్, మూడు నర్సింహ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జక్కుల సరిత, సెర్ప్ సీసీ కోల శోభ, ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక తదితరులు పాల్గొన్నారు.