ఏం కష్టమొచ్చిందో పాపం.. రైలులో వ్యక్తి ఆత్మహత్య

Nampally: Unknown Person Ends Life In Hubli Express - Sakshi

హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య 

సాక్షి, నాంపల్లి: హుబ్లీ నుంచి హైదరాబాదుకు వచ్చిన ఓ రైలులోని ఎస్‌ఎల్‌ఆర్‌ పార్శిల్‌ బోగీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్లాట్‌ఫారం మీదకు వచ్చిన రైలు బోగీలో ఉరేసుకుని వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్‌ పరిధిలోని నాంపల్లి (హైదరాబాదు) రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..  హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాదు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్‌ఫారం–1 మీద నిల్చున్న రైలులోని ప్రయాణికులందరూ దిగిపోయారు.

కానీ వస్తు రవాణా కోసం ఉంచిన  పార్శిల్‌ బోగీలో 60 ఏళ్ల వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హైదరాబాదు రైల్వే స్టేషన్‌లో ఆగిన రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తరలించే ముందు రైల్వే సిబ్బంది బోగీలను పరిశీలించారు. ఎస్‌ఎల్‌ఆర్‌ పార్శిల్‌ బోగీలో వేలాడుతూ మృతదేహం కనిపించడంతో రైల్వే సిబ్బంది స్థానిక జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బోగీలోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి భద్రపరిచారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top