కాంగ్రెస్‌ పాలన డిజాస్టర్‌ | KTR Sensational Comments On Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలన డిజాస్టర్‌

Jun 18 2026 5:29 AM | Updated on Jun 18 2026 5:29 AM

KTR Sensational Comments On Cm Revanth Reddy

ఆరు గ్యారంటీల జేమ్స్‌ బాండ్లు ఎటుపోయారు?

ఎస్‌ఐఆర్‌పై పాలేరు నియోజకవర్గ శ్రేణుల సమావేశంలో కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్‌ హయాంలో సంక్షేమం దారి తప్పి అభివృద్ధి కుంటుపడి పాలన డిజాస్టర్‌గా నిలిచింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు హిట్లర్‌ స్ఫూర్తి అంటాడు. ఎవడన్నా బుద్ధి ఉన్నోడు రావణాసురుడు, నరకాసుడు స్ఫూర్తి అంటాడా? ఆ వ్యాఖ్యలతోనే ఆయన నిజస్వరూపం బయటపడింది’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఎస్‌ఆర్‌ఐపై బుధవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా కేటీఆర్‌ తన ప్రసంగంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మలపై ధ్వజమెత్తారు. 

మంత్రుల అనుచరుల దందా కోసం..
ఖమ్మం వెలుగుమట్లలో పేదలు కట్టుకున్న వేయి ఇళ్లను రాత్రికి రాత్రి ప్రభుత్వం రాక్షసంగా కూల్చేసిందని తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అనుచరుల రియల్‌ ఎస్టేట్‌ దందా, సీఎం పైశాచికానందం కోసం ఆడబిడ్డలను రోడ్డున పడేశారన్నారు. రాష్ట్ర ఆదాయం పడిపోతుంటే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అవినీతి సామ్రాజ్యం మాత్రం వేల రెట్లు పెరుగుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. పొంగులేటి ములుగు జిల్లాలో రూ.4 వేల కోట్ల విలువైన ఇసుక దోచుకుంటున్నారని విమర్శించారు.

సంక్షోభంలో వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగం, రైతాంగం సంక్షోభంలో ఉందని.. పంట చేతికొచ్చి 60 రోజులు దాటినా ధాన్యం కొనే దిక్కులేదని కేటీఆర్‌ తెలిపారు. వ్యవసాయ మంత్రి తుమ్మల రైతుల శ్రేయస్సును గాలికొదిలేస్తే.. డిప్యూటీ సీఎం కమీషన్ల దందాల్లో జోరుగా ఉన్నారని ఆరోపించారు. ‘ప్రభుత్వానికి ఇంటర్వెల్‌ (రెండున్నరేళ్లు) అయిపోయింది.. ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం అట్టర్‌ డిజాస్టర్‌‘అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘హౌసింగ్‌ మంత్రిగా ఉన్న పొంగులేటి.. 20 లక్షల ఇళ్లు కట్టించాకే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం‘అని అంటున్నారని.. ఆ మాట మీద నిలబడే దమ్ము ఉందా అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాండ్‌ పేపర్లు రాసి ఆరు గ్యారంటీల కార్డులను 99 రోజులు భద్రంగా దాచుకోమన్నారని.. ఇప్పుడు ఆ కార్డులను ఎక్కడ పెట్టుకోవాలో చెప్పాలని కేటీఆర్‌ నిలదీశారు. పేదల కళ్లలో ఆనందం చూడాలనే ఉద్దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం నాడు సీఎంగా కేసీఆర్‌ అప్పు చేశారని కేటీఆర్‌ అన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లు తెస్తే, ఖమ్మం జిల్లా రైతుల కోసం సీతారామ ప్రాజెక్టును 80 శాతం కట్టించి, భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేశారన్నారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు లింగాల కమల్‌రాజ్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement