సాక్షి, హైదరాబాద్: మీనాక్షి నటరాజన్కు రేవంత్ వెన్నుపోటు పొడిచారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్పై రేవంత్ దొంగ కేసులుపెట్టించారని.. ఇక్కడి కేసు విషయాలు రేవంత్.. బీజేపీ నేతలకు చెప్పారంటూ ఆరోపించారు.
‘‘రేవంత్ పాలనకు సగం సమయం ముగిసింది. రేవంత్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయింది. ఇక శుభం కార్డే. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. త్వరలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ పదవి పోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్లో బీఆర్ఎస్దే విజయం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘శనివారం, ఆదివారం వస్తే హైడ్రా పేరుతో వందలాది ఇళ్లు కూలగొడుతున్నారు. మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. రాహుల్ గాంధీ అశోక్నగర్ వచ్చి చాయ్ తాగుతూ ఫోజులు కొట్టి నిరుద్యోగుల ముందు చెప్పారు. రేవంత్ సర్కార్.. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు. రేవంత్రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడని మీనాక్షి నటరాజ్ రాహుల్కి చెప్పింది.’’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.


