పెళ్లైన విషయాన్ని దాచి.. మరో యువతితో రెండో వివాహం.. విషయం తెలియడంతో
సాక్షి, ఖమ్మం: ఓ యువకుడు మొదటి పెళ్లి విషయాన్ని దాచి మరో యువతిని రెండో పెళ్లి చేసుకొని మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త తనను మోసం చేశాడని తెలుసుకున్న రెండో భార్య.. తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటిముందు నిరసన దీక్ష చేపట్టింది. వివరాలు.. ఖమ్మం పట్టణం రోటర్ నగరకు చెందిన నవజీవన్ ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకొని ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా డిసెంబర్ ఒకటో తేదీన ఖమ్మం పట్టణం ఎన్ఎస్టీ ప్రాంతానికి చెందిన కాసం సౌగంధికను రెండో వివాహం చేసుకున్నాడు.
పెళ్లయిన కొద్ది రోజుల నుంచి భార్యతో సఖ్యతగా ఉండకుండా ఆమెను వేధింపులు గురి చేసేవాడు. ఈ క్రమంలో యువతి బంధువులు పలుమార్లు నవజీవన్ను హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేగాక అతనికి తన కంటే ముందే వేరే యువతితో పెళ్ళి జరిగిన విషయం సౌగంధికకు తెలిసింది. దీంతో భర్త నవజీవన్పై మహిళా పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే అక్కడ తనకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో భర్త నవజీవన్ ఇంటిముందు శనివారం న్యాయం కోసం నిరసన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.