సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెక్లెస్ రోడ్డులో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించి మంగళవారం సచివాలయంలో మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారని, ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరాగాంధీ జయంతి నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.
నేడు మహిళలతో ముఖాముఖి
రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి అదే నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని సీఎం చెప్పారు. బుధవారం నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సచివాలయం నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలని సూచించారు.


