వలస జీవలు జల్లెడ

Hyderabad: Labour Department Collecting Migrant Workers Information - Sakshi

ఇతర ప్రాంతాలకు వలస వెళ్లివచ్చిన వారి వివరాల సేకరణ

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: వలసజీవుల సమాచారాన్ని కార్మికశాఖ సేకరిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లి తిరిగొచ్చిన కార్మికుల వివరాలను ఆరా తీస్తోంది. ఈ మేరకు మున్సిపల్‌ సర్కిళ్లు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో కార్మికుల సమాచారాన్ని రాబడుతోంది. బతుకు దెరువు కోసం వెళ్లిన వారిలో ఇప్పటి వరకు ఎంత మంది స్వస్థలాలకు  చేరారనే విషయాన్ని క్షేత్రస్థాయి సర్వేలో తెలుసుకుంటోంది.

వివరాలను సేకరిస్తున్న కార్మికశాఖ
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కార్మిక శాఖ ఈ సమాచారాన్ని సేకరిస్తోంది. జీవనోపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన కార్మికులు, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? ఏ రాష్ట్రం నుంచి తిరిగి వచ్చారు? తదితర వివరాలను సమీకరిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడలతోపాటు ఎంపిక చేసిన ప్రాంతాలు, బస్తీల్లో కార్మిక శాఖకు చెందిన సిబ్బంది, ఆయా పురపాలక సంఘాలు, జీపీల ఉద్యోగుల సాయంతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
 

గతేడాది కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో వలస కార్మికులు, కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటంతోపాటు ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. భవన నిర్మాణ రంగంతోపాటు వివిధ పరిశ్రమల్లో పనుల కోసం వచ్చిన వలస కార్మికులు, కూలీలు, వారి కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నట్లు కరోనా తరుణంలో అధికార యంత్రాంగం గుర్తించి అన్ని విధాల సహకారాలు అందించింది. సెకండ్‌ వేవ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న దశలో వలస కార్మికులు, కూలీల వివరాల నేపథ్యంలో మరోసారి వారికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. 

( చదవండి: కోవిడ్‌ వ్యాక్సిన్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top