ఉబికొచ్చిన భూగర్భ జలాలు | Groundwater levels have risen due to above normal rainfall | Sakshi
Sakshi News home page

ఉబికొచ్చిన భూగర్భ జలాలు

Sep 3 2025 3:18 AM | Updated on Sep 3 2025 3:18 AM

Groundwater levels have risen due to above normal rainfall

ఆగస్టులో సాధారణం కంటే 26% అధికంగా వర్షపాతం

రాష్ట్రంలో 1.71 నుంచి 11.38 మీటర్లు రేంజ్‌లో భూగర్భ జలాల లభ్యత

2024 ఆగస్టులో 6.84 మీటర్ల సగటు లోతులో లభ్యత.. ఈ ఏడాది 1.06 మీటర్లు వృద్ధి

సాక్షి, హైదరాబాద్‌: సాధారణానికి మించి వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు ఉబికి పైకొచ్చాయి. భూగర్భ జలాల రాష్ట్ర సగటు లోతు మేలో 10.07 మీటర్లకు పడిపోగా, వర్షా కాలం ప్రారంభం కావడంతో జూన్‌లో 9.47, జూలైలో 8.37 మీటర్లకు వృద్ధి చెందాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలతో ఆగస్టులో ఏకంగా 5.78 మీటర్ల లోతుకు ఉబికివచ్చాయి. 2024 ఆగస్టులో 6.84 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యం కాగా, 2025 ఆగస్టులో 1.06 మీటర్ల మేర వృద్ధితో 5.78 మీటర్ల లోతుల్లోనే లభ్యం కావడం గమనార్హం. 

అంటే గతేడాది కంటే ఈ ఏడాది భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర భూగర్భ జలశాఖ జూన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి తాజాగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి, తర్వాతి నెలలో నివేదికలను విడుదల చేస్తూ ఉంటుంది.

ఆదిలాబాద్‌లో భారీగా వృద్ధి 
ఆదిలాబాద్‌ జిల్లాలో 1.71 మీటర్ల లోతుల్లోనే భూగర్భ జలాల లభ్యత ఉండగా, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 11.38 మీటర్ల లోతుల్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టాన్ని 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. 

» భూగర్భ జలాలు 0– 5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. 18 జిల్లాల్లో 0–5 మీటర్ల లోతులోనే భూగర్భ జలమట్టం ఉందని గుర్తించారు. 13 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతులో, 2 జిల్లాల్లో 10–15 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నట్టు తేలింది.

» 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. 

సాధారణం కంటే అధికంగా...
ఆగస్టులో రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 574 మి.మీ.లు కాగా, 2025 ఆగస్టులో 721 మి.మీ.ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని స్పష్టమవుతోంది. 18 జిల్లాలు సాధారణం కంటే అధికం (21శాతం నుంచి 90 శాతం వరకు), మిగిలిన 15 జిల్లాలు సాధారణ (–13% నుంచి 16 శాతం) వర్షపాతాన్ని నమోదు చేశాయి. 

గతేడాది కంటే మెరుగే...
2024 ఆగస్టుతో పోల్చితే 2025 ఆగస్టులో రాష్ట్రంలోని 23 జిల్లాల్లో భూగర్భ జలాలు మెరుగైన స్థితిలో ఉండగా, 10 జిల్లాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 5 మీటర్లు, అత్యల్పంగా నిజామాబాద్‌ జిల్లాలో 0.02 మీటర్ల వృద్ధి నమోదైంది.

431 మండలాల్లో మెరుగుదల
రాష్ట్రంలో మొత్తం 621 మండలాలు ఉండగా, దశాబ్ద కాల సగటుతో పోలిస్తే.. గత ఆగస్టు నెలలో 528 మండలాల్లో (86 శాతం) 0.01 నుంచి 19.64 మీటర్ల వరకు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. మిగిలిన 93 మండలాల్లో (21 శాతం) 0.01 నుంచి 20.92 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం పతనమైందని గణాంకాలు చెబుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement