సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలో నిబంధనలు ఉల్లంఘించి, నియమాలను పట్టించుకోకుండా ఇంజినీర్ల బదిలీలు జరిగినా వారికి కొత్త పోస్టులు, బాధ్యతలు అప్పగించలేదు. పబ్లిక్హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఈ ఇంజినీర్ల బదిలీల ప్రక్రియ మొత్తం అస్తవ్యస్తంగా ఆగమాగంగా జరగడం.. నాలుగేళ్లు మించి ఒకేచోట ఉన్నవారు సైతం బదిలీ కాకపోవడం, ఇంజినీర్ల బదిలీ వివరాలు కేవలం వారికి తప్ప పైఅధికారులైన సీఈ, ఎస్ఈలకు సైతం తెలియకపోవడం, అసలు బదిలీ ప్రక్రియే షెడ్యూలు కనుగుణంగా జరగకపోవడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయినప్పటికీ, రిలీవింగ్ ఆర్డర్ లేకుండానే సీఎంసీలో చేరేందుకు వెళ్లిన ఇంజినీర్ను అక్కడ చేర్చుకోలేదు. ఎంఎంసీ నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ అయి వచి్చన పదిమందికి పైగా ఇంజినీర్లు జాయినింగ్ రిపోర్టులు ఇచ్చినప్పటికీ, వారికి ఎలాంటి పోస్టింగులు, బాధ్యతలు అప్పగించలేదని తెలిసింది. ఇందుకు కారణం ఏమిటంటే.. బదిలీలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో జీహెచ్ఎంసీ నుంచి ఎవరికీ రిలీవింగ్ ఆర్డర్లు ఇవ్వవద్దని, ఇతర కార్పొరేషన్ల నుంచి వచి్చన వారిని చేర్చుకోవద్దనీ కమిషనర్ కర్ణన్ తెలిపినట్లు సమాచారం. బదిలీల రగడ ఏ మలుపు తిరగనుందో తెలియని పరిస్థితి నెలకొంది.


