
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు.
ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది.
దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.