
సాక్షి, సంగారెడ్డి: జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం జహీరాబాద్లో పర్యటించిన సీఎం.. హుగ్గెల్లి జంక్షన్లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాచునూరులో కేంద్రీయ విద్యాలయం భవనాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్ చేరుకున్న సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో రూ.494.67 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 తర్వాత నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని.. భూసేకరణలో అన్యాయం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిమ్జ్కు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం పెంచామని చెప్పారు. నిమ్జ్ కోసం భూములిచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. త్వరలోనే 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.

నేషనల్ హైవేపై అండర్ పాస్ నిర్మాణాలు చేస్తాం. సింగూరు ప్రాజెక్టును అద్భుతమైన టూరిజంగా తీర్చిదిద్దుతాం. హుండాయ్ కార్ల పరిశ్రమ ఏర్పాటు కాబోతుందని రేవంత్ అన్నారు. జహీరాబాద్ అభివృద్ధి సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామని.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ చెప్పారు.
