సాక్షి, హైదరాబాద్: తాను డాక్టర్ను కాదు.. కానీ సోషల్ డాక్టర్నని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ జరగడం సంతోషమన్నారు.
‘‘భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు వచ్చారు. మీరంతా సక్సెస్ ఫుల్ కార్డియాలజిస్టులు. అయినా మీ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ కాన్ఫరెన్స్ కు వచ్చారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
..కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే మీ కెరీర్కు ముగింపు పలికినట్లే. ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరగడం ఎంతో గర్వకారణం. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా మంది డాక్టర్లు అవ్వాలనుకున్నా అందుకు అర్హత సాధించలేరు. మీరంతా సమాజంలో ఒక ప్రత్యేక గ్రూప్. డాక్టర్లు ప్రాణాలు కాపాడతారని మేం బలంగా నమ్ముతాం. మనుషులపట్ల, సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దు.
..ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రజల ప్రయోజనాల కోసం మా పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఆ దిశగా మీ సలహాలు, సూచనలు ఇచ్చి మాకు సహకరించండి. విజ్ఞానం, సాంకేతికత ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే లేటెస్ట్ టెక్నాలజీ పై మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి.. కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దు.
..ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని మీకు తెలుసు. గుండె జబ్బులను నివారించే మిషన్లో మనమందరం భాగస్వాములం అవుదాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనమందరం కలిసి పనిచేద్దాం. విద్యార్థులకు సీపీఆర్ నేర్పించడానికి మీరు స్వచ్ఛందంగా ముందుకు రాగలిగితే.. మన దేశంలో చాలా మంది ప్రాణాలను కాపాడగలం. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ గురించి అంతా కృషి చేయాలని మీ అందరినీ కోరుతున్నా. ఆరోగ్య సంరక్షణలో మనం వరల్డ్ బెస్ట్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ వైద్యుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాలి’’ అని రేవంత్ అన్నారు.


