Telangana: కరోనా బాధితులతో సీఎం కేసీఆర్‌

CM KCR Arrived Warangal MGM Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వరంగల్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు శుక్రవారం రోడ్డుమార్గాన వెళ్లారు. వరంగలోని ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్‌ వార్డులను పరిశీలించారు. కరోనా వైరస్‌ బాధితులకు సీఎం కేసీఆర్‌ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులతో సీఎం మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సీఎం కేసీఆర్‌ సందర్శించిన విషయం తెలిసిందే. 

నగరంలో 5 గంటలు..
రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్‌ ఉమ్మడి వరంగల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర జిల్లాల్లో పర్యటించినా.. వరంగల్‌ నగరానికి చాలాకాలం తర్వాత వస్తున్నారు. సుమారు 5 గంటల పాటు వరంగల్‌లో ఉండనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం ఎంజీఎం ఆస్పత్రి, సెంట్రల్‌ జైలును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన విషయం తెలిసిందే. కోవిడ్‌ వార్డులో బాధితులకు అందుతున్న వైద్య చికిత్సపై ఆరా తీశారు. సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆరు సెక్టార్లుగా భారీ భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంత్‌, పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top