చార్మినార్‌ చెక్కుచెదరకుండా.. పిడుగుపాటుకు గురికాకుండా లైటనింగ్‌ కండక్టర్‌ | Central Archaeological Survey Protect keep Charminar Intact | Sakshi
Sakshi News home page

చార్మినార్‌ చెక్కుచెదరకుండా.. పిడుగుపాటుకు గురికాకుండా లైటనింగ్‌ కండక్టర్‌

Feb 18 2022 11:50 AM | Updated on Feb 18 2022 12:05 PM

Central Archaeological Survey Protect keep Charminar Intact - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగు శతాబ్దాలకుపైగా నవనవోన్మేషం.. నగరానికే తలమానికం.. అపురూప కట్టడం మన చార్మినార్‌. దీనిని చెక్కుచెదరకుండా కాపాడేందుకు కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) రక్షణ చర్యలు తీసుకుంటోంది. పిడుగుపాటు ఇతర ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే దిశగా లైటనింగ్‌ కండక్టర్‌ను ఏర్పాటు చేస్తోంది. చారిత్రక కట్టడం దెబ్బతినకుండా.. పిడుగుపాటుకు గురైనా నష్టం వాటిల్లకుండా ఈ కండక్టర్‌ నిరోధించనుంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. చార్మినార్‌  అంతర్భాగంలో ఎలక్ట్రికల్‌ కండక్టర్ల ఏర్పాటు కోసం గోతుల తవ్వకాలు చేపట్టింది. సమాచార లోపం కారణంగా స్థానికులు.. సొరంగాల తవ్వకాలు జరుపుతున్నారని పొరబడి ఆందోళనకు దిగారు.

చార్మినార్‌ కట్టడం పరిరక్షణలో భాగంగా నాలు గు మినార్‌లతో పాటు మరిన్ని అంతర్గత నిర్మాణాలకు ప్రకృతి పరంగా, ఇతర ప్రమాదాల కా రణంగా నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టా మని ఆర్కియాలజీ సూపరింటెండెంట్‌ ఎస్‌.ఎ.స్మిత, అధికారులు ఎస్‌. కుమార్, రాజేశ్వరి ‘సాక్షి’కి తెలిపారు. లైటనింగ్‌ కండక్టర్ల ఏర్పాటుకు చేస్తున్న తవ్వకాల విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, కట్టడాన్ని పరిరక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement