అనాథ పురిటి బిడ్డను కాపాడిన శునకాలు
అది పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా, నవద్వీప్ పట్టణం. ఎముకలు కొరికే చలి. నిశ్శబ్దపు తెల్లవారుజాము.. ఆ చీకట్లో రైల్వే కార్మికుల కాలనీలోని ఒక బాత్రూమ్ వెలుపల నేలపై నవజాత శిశువు. శరీరంపై ఎలాంటి వస్త్రం లేదు.. పురిటి నెత్తురు మరకలు తొలగలేదు.. ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చూడని ఆ పసికందును ఎవరో కనికరం లేకుండా వదిలివేశారు. ఆ చిన్ని ప్రాణం గడ్డకట్టే చలిలో వణికిపోయింది.. విలవిల్లాడిపోయింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది.
వలయం కట్టి.. తెల్లార్లూ కాపలా కాసి
వీధి కుక్కల గుంపు ఒకటి ఆ శిశువును చుట్టుముట్టింది. అవి అరవలేదు. కదలకుండా, ప్రశాంతంగా.. శిశువు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచాయి. రాత్రంతా, అవి నిశ్శబ్ద సైనికుల్లా నిలబడ్డాయి. వేకువ వెలుగు వచ్చే వరకు.. ఆ బిడ్డ దగ్గరకు ఎవరినీ రాని వ్వలేదు. పసికందును తాకనివ్వలేదు. ‘ఉదయం లేచాక కనిపించిన ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది’.. అని స్థానికుడు సుక్లా మొండల్ ఉద్వేగంగా చెప్పారు. ‘ఆ కుక్కలు మామూలుగా లేవు. అవి అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆ బిడ్డ బతకడానికి పోరాడుతోందని అవి అర్థం చేసుకున్నట్లు అనిపించింది’.. అని వ్యాఖ్యానించారు.
పసికందు చుట్టూ సెంట్రీల్లా..
తెల్లవారుజామున శిశువు చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పటివరకు ఎవరో జబ్బు పడిన బిడ్డ అనుకున్న స్థానికులకు, ఆ దృశ్యం చూసి నోట మాట రాలేదు. ఆ కుక్కలు కంచె వేసినట్లు, సెంట్రీల్లా పసికందు చుట్టూ నిల్చున్నాయి. సుక్లా మొండల్ ధైర్యం చేసి, మెల్లగా ముందుకు వెళ్లగానే.. ఆ కుక్కలు పక్కకు తప్పుకున్నాయి. వెంటనే ఆమె బిడ్డను తన దుపట్టాలో చుట్టి ఆసుపత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు, ఆ బిడ్డకు ఎటువంటి గాయాలు లేవని, కేవలం పుట్టిన కొన్ని నిమిషాలకే ఎవరో వదిలేశారని నిర్ధారించారు. పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
మనుషుల్ని మించిన మానవీయత..
‘మేము ఎప్పుడూ ఈసడించుకుని.. తిట్టుకునే శునకాలే ఇవి.. కానీ, ఈ బిడ్డను వదిలి వెళ్లిన వారికంటే ఇవే ఎక్కువ మానవత్వాన్ని చూపించాయి’.. అని ఒక రైల్వే కార్మికుడు వ్యాఖ్యానించారు. సాయంత్రం అయ్యేసరికి కాలనీలో దృశ్యం మారిపోయింది. ఆ రాత్రంతా బిడ్డను కాపాడిన కుక్కల దగ్గరికి కాలనీలోని చిన్నారులంతా వెళ్లారు. వాటిని ఆప్యాయంగా నిమిరారు. ప్రేమతో బిస్కెట్లు తినిపించారు. ఆ కుక్కలు కేవలం ఒక శిశువును కాపాడటమే కాదు, ఆ రోజు ఆ కాలనీ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చాయి. మానవత్వం అనేది నాలుగు కాళ్లపై కూడా రావచ్చని నిరూపించాయి.
ఇలాంటి ఘటనే..
1996లో కోల్కతా సమీపంలో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త గుట్టలో వదిలేశారు. అయితే ఆ బిడ్డకు మూడు వీధి కుక్కలు కాపలాగా ఉన్నాయి. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డ సంరక్షణా కేంద్రానికి చేరింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


