Hyderabad: బిర్యానీ తిని బాలుడి మృతి? 

Boy Died After Eating Chicken Biryani At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చికెన్‌ బిర్యానీ తెచ్చుకొని కుటుంబ సమేతంగా కలిసి భోంచేసిన ఆ కుటుంబంలో ముగ్గురు హాస్పిటల్‌ పాలు కాగా..ఓ బాలుడు మృతి చెందిన సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖైరతాబాద్‌ మారుతీనగర్‌లో నివాసముండే రాంబాబు ప్రైవేటు ఉద్యోగి. ఇతనికి భార్య త్రివేణి, కుమారుడు గౌతం నంద (10), కూతరు నిహారిక ఉన్నారు.

ఈ నెల 13వ తేదీ శనివారం ఖైరతాబాద్‌లో మొఘల్‌ రెస్టారెంట్‌ నుంచి రెండు సింగల్‌ చికెన్‌ బిర్యాని పార్సిల్‌ తీసుకొని ఇంటికి వెళ్లాడు. రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి బిర్యాని తిని పడుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలైనా ఇంట్లోవారెవ్వరు బయటకు రాకపోవడంతో పక్కింటి వారు తలుపు తట్టి లేపారు. మత్తుగా మేల్కొన్న త్రివేణి తలుపు తీయడంతో పక్కింటి వారు వెంటనే అంబులెన్స్‌లో తండ్రితో పాటు కుమారుడు, కూతుర్ని ప్రభుత్వ హెల్త్‌ సెంటర్‌కు తీసుకువెళ్లారు.

అప్పటికే బాబు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి, కూతుర్ని అమీర్‌పేట్‌ వెల్‌నెస్‌ సెంటర్‌కు తరలించి చికిత్స ఇవ్వడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తాము 13 వ తేదీ రాత్రి బిర్యానీ తెచ్చుకుని తిని నిద్రపోయామని, ఆ తర్వాత ఏ జరిగిందో తెలియలేదని త్రివేణి పేర్కొందని, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.   

(చదవండి: ప్రేమించలేదని  గొంతు కోసుకున్నాడు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top