సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు రక్షణ (బెయిల్) పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిస్థితిలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని హై కోర్టు వెల్లడించింది.
‘బాధితురాలు ముమ్మాటికీ మైనరే’
పిటిషన్పై విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. బండి భగీరథ్కు ఎలాంటి ముందస్తు రక్షణ ఇవ్వకూడదని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో బాధితురాలి వయసుపై వస్తున్న అనుమానాలకు పీపీ తెరదించారు. బాధితురాలు ముమ్మాటికీ మైనరేనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. విచారణలో బాధితురాలి వయసు 17 ఏళ్ల 3 నెలలుగా నిర్ధారణ అయిందని తెలిపారు. దీనికి సంబంధించి ఆమె పదో తరగతి (టెన్త్) మెమోతో పాటు, జీహెచ్ఎంసీ (GHMC) జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ కూడా ఉన్నట్లు కోర్టుకు సమర్పించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సైతం బాధితురాలు మైనర్ అనే విషయం స్పష్టమైందని పీపీ పేర్కొన్నారు.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో జరిగిన సంఘటన మొత్తాన్ని వివరంగా వివరించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. "బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే సదరు బాలిక అతనితో కలిసి బయటకు వెళ్లింది" అని పీపీ వాదనలు వినిపించారు. ఈ కారణాల చేతనే పోలీసులు అతనిపై లైంగిక దాడి కేసులు నమోదు చేశారని, అందువల్ల నిందితుడికి ముందస్తు రక్షణ కల్పించకూడదని కోరారు.
కాగా, అంతకుముందు బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో తన వాదనలు వినిపించారు. బండి భగీరథ్ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న కోర్టును కోరారు.


