ఆస్పత్రికి–ఎక్స్రే కేంద్రానికి అర కిలోమీటర్ దూరం..
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన నాలుగు నెలల పసికందు అక్షితకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మూ డు రోజులుగా చిన్నపిల్లల వార్డులో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
తదుపరి పరీక్షల కోసం ఎక్స్రే తీయాలని సూచించారు. చిన్నపిల్లల వార్డు నుంచి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఎక్స్రే కేంద్రానికి పాపను తీసుకెళ్లాల్సి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని, పసికందును ఎత్తుకొని మండుటెండలో నడుచుకుంటూ ఎక్స్రే కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అన్ని సేవలు ఒకేచోట అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ భజరంగ్ ప్రసాద్, నల్లగొండ


