16 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూత!  | 16 Engineering Colleges In The State Will Be Closed In Telangana | Sakshi
Sakshi News home page

16 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూత! 

Jul 25 2020 4:16 AM | Updated on Jul 25 2020 9:09 AM

16 Engineering Colleges In The State Will Be Closed In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూత పడనున్నాయి. దీంతో వాటిల్లో ఉన్న దాదాపు 4 వేల సీట్లు రద్దు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 201 ఇంజనీరింగ్‌ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వగా, మరో 16 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కాలేజీల్లోని దాదాపు 4 వేల సీట్లలో మొదటి సంవత్సరం ప్రవేశాలు వద్దని జేఎన్‌టీయూకు దరఖాస్తు చేశాయి.

గత నాలుగేళ్లుగా వాటిల్లో పెద్దగా ప్రవేశాలు లేకపోవడం, గతేడాది అన్ని బ్రాంచీల్లో కలిపి 70లోపే ప్రవేశాలు ఉండటం, అంతకుముందు సంవత్సరాల్లోనూ పరిస్థితి అలాగే ఉండటంతో ఆ కాలేజీలన్నీ మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు వరుసగా మూడేళ్లు 30 శాతం కంటే తక్కువ ప్రవేశాలు ఉంటే సగం సీట్లకే అనుమతి ఇస్తామని ఏఐసీటీఈ గతంలోనే స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర యూనివర్సిటీలు మాత్రం 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయ్యే కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతించమని తెలిపింది. ఈసారి ఆ నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement