చైన్నెలో వాటర్ ఎక్స్పో
సాక్షి, చైన్నె: అత్యాధునిక సాంకేతికత, వినూత్న ఆవిష్కరణల ప్రదర్శన, నీటి భద్రత, పారిశ్రామిక స్థిరత్వం, పర్యావరణ పరిరక్షణ దిశగా చైన్నెలో వాటర్ ఎక్స్పో ఏర్పాటైంది. వాటర్ టుడే నేతృత్వంలో నందంబాక్కం ట్రేడ్ సెంటర్ వేదికగా ఈ ప్రదర్శన జరుగుతోంది. ఈ ప్రదర్శన అగ్రశ్రేణి పరిశ్రమ నిపుణులు, అత్యాధునిక సాంకేతికతలు, వినూత్న ఆవిష్కరణలను ఒక చోట చేర్చే విధంగా ఇది బ్రహ్మాండ వేదికగా నిలవనుంది. ఈ ఎక్స్పోకు భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 200 మంది నిపుణులు, సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. నీటి శుద్ధి, మురుగునీటి రీసైక్లింగ్, డీశాలినేషన్, వడపోత, శుద్ధి, పంపింగ్ వ్యవస్థలు, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీలకు సంబంధించిన విస్తృత శ్రేణి ఉత్పత్తుల ఆవిష్కరణలు జరగనున్నాయి. సందర్శకులు ఇక్కడి శుద్ధీకరణ తదితర అంశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు. వాటర్ ఎక్స్పోలో సమగ్రమైన సెమినార్ సిరీస్ నిర్వహించనున్నామని నిర్వాహకులు ప్రకటించారు. ప్రఖ్యాత నిపుణులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక నిపుణులు కలిసి నీరు, మురుగునీటి నిర్వహణలో కీలక ధోరణులు, సవాళ్లు, పరిష్కారాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐసీసీడబ్ల్యూ సీఈఓ ఈ నందకుమార్, ఎన్ఎస్డబ్ల్యూ ఏఐ సదరన్చాప్టర్ చైర్మన్ ఎస్.సంపత్, ఎంసీసీఐ కార్యదర్శి సరస్వతి, పీహెచ్డీసీసీఐ కార్యదర్శి రంజిత్ మెహతా, ఐఎస్ఎస్–ఏబీ ఽహెడ్ మయాంక్ మిట్టల్, ఇతర ప్రతినిధులు వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.


