సూర్య 47వ చిత్రం తమిళం కాదా?
తమిళసినిమా: బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు సూర్య. ఈయన ఇంతకుముందు నటించిన రెట్రో చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సూర్య వరుసగా మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కరుప్పు చిత్రం ఒకటి. ఆర్ జే.బాలాజి దర్శకత్వం వహిస్తున్న ఇందులో త్రిష నాయకిగా నటిస్తున్నారు. ఇందులో సూర్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ చిత్రం తెరపైకి రానుంది. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. ఇందులో మమిత బైజు నాయకిగా నటిస్తున్నారు. అదేవిధంగా సూర్య మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నారు. ఇది సూర్య నటిస్తున్న 47వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో నజ్రియా నాయకిగా నటిస్తున్నారు. ఇందులో సూర్య మరోసారి పోలీస్ అధికారిగా నటిస్తుండడం విశేషం. తాజాగా సూర్య హీరోగా చేస్తున్న చిత్రం కూడా మలయాళం చిత్రమా అనే ప్రశ్న వ్యక్తం అవుతోంది. దీంతో మాధవన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సూర్య 47 పూర్తిగా తమిళ చిత్రం అని, ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు చెప్పారు.


