ఎవరు గౌరవిస్తారో.. వారికే మద్దతు
సాక్షి,చైన్నె: తమ సమాజాన్ని ఎవరు గౌరవిస్తారో వారికే మా మద్దతు ప్రకటిస్తామని తమిళ్ తెలుగు నేషనల్ పార్టీ (టీటీఎన్పీ) అధ్యక్షుడు ఈవీఎస్ రాజకుమార్ నాయుడు అన్నారు. రానున్న 2026 అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఆయన చైన్నె మైలాపూర్లో బుధవారం తమ పార్టీ తరపున 53 మంది అభ్యర్థులను సిద్ధపరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులను పరిచయం చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో రాజకుమార్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ 150 నియోజకవర్గాల్లో పోటీ చేసే దిశగా సన్నాహాలు చేస్తుందన్నారు. పలు నియోజకవర్గాల్లో విజయాలను నిర్ణయించే శక్తి తమ పార్టీకి ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమితో తాము పొత్తు పెట్టుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. తమిళనాడులో తెలుగువారు సుమారు 2 కోట్ల మందికి పైగా ఉన్నారన్నారు. తమ సమాజానికి ఏ పార్టీ గౌరవం ఇస్తుందో ఆ పార్టీకి తమ మద్దతు ఉండబోతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి తాము వలసవచ్చినట్లు పేర్కొనడం అబద్ధమన్నారు. సుమారు 900 ఏళ్ల కాలంగా తాను, తన పూర్వీకులు తమిళనాడులోనే ఉంటున్నట్లు స్పష్టంగా చెప్పారు. అందుకు తగిన ఆధారాలు చూపగలనన్నారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ లాంటి వారు చేసే విమర్శలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమను కించపరుస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. తాను తమిళ భాష ఉద్యమంలో పాల్గొని రైలురోకో చేసినట్లు గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థుల సంఘ నాయకుడిగా పలు పోరాటాలలో పాల్గొన్న విషయాలను గుర్తు చేశారు. ఎవరు ఏ మట్టిలో పుడుతారో వారు ఆ ప్రాంతానికే సొంతగాళ్ల అన్న నినాదాన్ని ఆయన వినిపించారు. తెలుగువాడినైనప్పటికీ తమిళగడ్డపై పుట్టిన కారణంగా ఇక్కడ పోటీ చేసేందుకు తనకు అన్ని విధాల హక్కులు ఉన్నట్టు వెల్లడించారు.


