క్లుప్తంగా
అన్నాడీఎంకే కేడర్కు ద్విచక్ర వాహనాల పంపిణీ
సాక్షి,చైన్నె : దివంగత సీఎం జయలలిత 78వ జయంతిని పురస్కరించుకని కేడర్కు ద్విచక్ర వాహనాలను అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ అందజేశారు. సునీల్ నేతృత్వంలో మంగళవారం జయలలిత జయంతి వేడుక ఘనంగా జరిగింది. పేదలకు సహాయకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తేనాంపేట అరవింద్, సీఐటీ నగర్ ముస్తాఫాలకు ద్విచక్ర వాహనాలను సునీల్ అందజేశారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.
నీటి తొట్టెలో పడి
బాలుడి మృతి
తిరువొత్తియూరు: నీటి తొట్టెలో పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన విలుపురం జిల్లాలో చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా, మయిలం సమీపంలోని చిన్న నెర్కుణం గ్రామానికి చెందిన సతీష్ ఆటోడ్రైవర్. ఇతనికి కుమారుడు గురుషిత్(9), కుమార్తె ఇనియా ( 11) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన ఇద్దరు పిల్లలను బడికి పంపి సతీష్ ఆటో సవారీ కోసం బయలుదేరి వెళ్లాడు. అదేవిధంగా అతని భార్య ఉమామహేశ్వరి కూడా పనికి వెళ్లింది. సాయంత్రం మహేశ్వరి ఇంటికి వచ్చి చూడగా ఇనియా మాత్రమే ఇంట్లో ఉంది. గురుషిత్ కనిపించలేదు. అతని కోసం వెతికారు. తెల్లవారు జాము 2 గంటలకు సతీష్ ఇంటి పక్కన ఓ వ్యక్తి ఇల్లు కడుతున్న నీటి ట్యాంకులో వెళ్లి చూడగా గురుషిత్ నీటిలో తేలుతూ కనిపించాడు. వెంటనే అతన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతిచెందాడని నిర్ధారించారు. సమాచారం అందుకున్న మయి లం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో మునిగి ..
తిరువళ్లూరు: చెరువులో మునిగి ఓ బాలుడు మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని తేరువాయి కండ్రిగ గ్రామంలో చెరువు ఉంది. దీనికి సమీపంలో సత్యవేడుకు చెందిన అడుగురాజా కుటుంబం బాతుల మేపడానికి వచ్చి తాత్కాలికంగా షెడ్ నిర్మించుకుని నివాసం వుంటున్నారు. సోమవారం రాత్రి షెడ్ నుంచి సమీపంలోని చెరువు వద్దకు వెళుతూ చెరువలో రాజా కుమారుడు దేవరాజ్(7) పడిపోయాడు. ఆలస్యంగా గుర్తించి బాలుడిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు చెరువు నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన విద్యార్థి ..
అన్నానగర్: ఆటో, కాలేజీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నైల్లె జిల్లా సుత్తమల్లి విల్కు ప్రాంతంలోని వీఓసీ నగర్కు చెందిన ఇసక్కియప్పన్ (30). ఇతను తాచ్చనల్లూరు ప్రాంతంలోని ఇంజినీరింగ్ కాలేజీ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత 20వ తేదీ ఉదయం కళాశాల బస్సు నడుపుతుండగా, నైల్లె–కడైయం రోడ్డులోని సుత్తమల్లి సమీపంలోని విశ్వనాథన్ నగర్ ప్రాంతంలో ముందు వెళుతున్న ఆటోను ఢీకొట్టాడు. ఈఘటనలో ఆటో రోడ్డుపై బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సుత్తమల్లికి చెందిన యస్వాని (15), పళవూర్ గ్రామానికి చెందిన సెల్వబాలా (15), ముత్తు అరుల్ (15) గాయపడ్డారు. గాయపడ్డ వీరిని నైల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెల్వబాల మంగళవారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను ఢీకొన్న మినీలారీ
–ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
తిరువొత్తియూరు: శిరువాపురి ఆలయం వద్ద బైక్ను మినీ లారీ ఢీకొన్న ప్రమాదంలో చైన్నెకి చెందిన భక్తుడు మృతిచెందాడు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. చైన్నె నమ్మాళ్వార్ పేటకు చెందిన జగన్నాథ్ (45). మంగళవారం కృత్తిక నక్షత్రం కావడంతో కవరపేట సమీపం, శిరువాపురి మురుగన్ ఆలయంలో స్వామి దర్శనం కోసం బైక్లో బయలుదేరారు. అతనితో పాటు బంధువు దేవనాయకి (46) వెళ్లారు. కవరపేట వద్ద శిరువాపురి ఆలయానికి వెళ్లే సర్వీస్ రోడ్డులో మినీలారీ అదుపుతప్పి మోటార్ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో జగన్నాథ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దేవనాయకి తీవ్రంగా గాయపడింది. విషయం తెలిసి కవరైపేట పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన దేవనాయకి స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


