తమిళ–ఇండో–యూరోపియన్ నిఘంటువు
సాక్షి, చైన్నె: తమిళ – ఇండో– యూరోపియన్ తులనాత్మక శబ్ద ఉత్పత్తి నిఘంటువు నాల్గవ సంపుటిని సిద్ధం చేశారు. దీనిని శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్ను కూడా ఆయన ప్రారంభించారు. తమిళనాడు పాఠ్య పుస్తకం, ఎడ్యుకేషన్ సర్వీసెస్ కార్పొరేషన్, ఆక్స్ఫర్డ్ యూనవర్సిటీ ప్రెస్ సహకారంతో తమిళ– ఇండో– యూరోపియన్ ప్రాజెక్టుకు రూ. రూ. 8 కోట్లు గతంలో కేటాయించారు. తమిళం – ఇండో–యూరోపియన్ భాషల మధ్య ఉన్న మూలపద సంబంధాలను శాసీ్త్రయ పద్ధతిలో అధ్యయనం చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా నిర్ణయించారు. చీఫ్ ఎడిటర్ డాక్టర్ కె. అరసేంద్రన్ నాయకత్వంలో 20 మంది పండితుల బృందం ఈ పరిశోధనలో నిమగ్నమై ఉంది. ఇండో–యూరోపియన్ భాషలలో గుర్తించబడిన 461 మూలపదాలలో సుమారు 300 పదాలు తమిళంతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధకులు భావించారు.గత ఏడాది జనవరిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్తో అధికారిక ఒప్పందం కుదుర్చుకుని, ప్రాజెక్ట్ సాధారణ పరిచయం , మొదటి సంపుటి విడుదల కాగా, అనంతరం రెండవ, మూడవ సంపుటులు వెలువడ్డాయి. తాజాగా మాతృభాషా దినోత్సవంలో భాగంగా నాలుగో సంపుటిని విడుదల చేశారు. ఇందులో తమిళం, లాటిన్, గ్రీకు, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, సంస్కృతి, పాళీ, సింహళ వంటి ఇండో–యూరోపియన్ భాషల పదాల తులనాత్మక నిర్మాణ చరిత్రను సమగ్రంగా సేకరించారు. భాషల మధ్య ఉన్న శబ్ద, రూప, అర్థ సంబంధాలను విశ్లేషిస్తూ ఈ సంపుటి రూపొందించారు. ఈ సంపుటి ఆవిష్కరణ అనంతరం జరిగిన అంతర్జాతీయ సెమినార్లో వివిధ దేశాల భాషావేత్తలు పాల్గొని తమిళ భాష ప్రాచీనత, ప్రపంచవ్యాప్తవిస్తృతి, తమిళ–ఇండో–యూరోపియన్ భాషల తులనాత్మక అధ్యయన ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో మంత్రులు స్వామినాధన్, శేఖర్బాబు, అన్బిల్ మహేశ్, మేయర్ ప్రియ, ఎమ్మెల్యేలు పరంధామన్ , ఎఎంవీ ప్రభాకర రాజ, సీఎస్ మురుగానందంలతో పాటుగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, దేశ విదేశాల భాషా నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ తమిళ భాషా పరిశోధనలో ఒక కీలక ఘట్టంగా నిలిచి, భాషా శాస్త్ర రంగంలో అంతర్జాతీయ స్థాయిలో తమిళానికి మరింత గుర్తింపు తీసుకురానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.


