క్లుప్తంగా
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు
– తప్పిన ప్రమాదం
తిరుత్తణి: ప్రభుత్వ బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో గోడలు కూలి, వస్తువులు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు కుటుంబీకులు ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటనకు సంబంధించి తిరుత్తణి పోలీసుల కథనం మేరకు..పొదటూరుపేట డిపోకు చెందిన ప్రభుత్వ టౌన్ బస్సు ఆదివారం ఉదయం 30 మంది ప్రయాణికులతో తిరుత్తణి అన్నాబస్టాండు నుంచి పొదటూరుపేట బస్టాండుకు బయలుదేరింది. బస్సు పొదటూరుపేట తిరుత్తణి రాష్ట్ర రహదారిలో కృష్ణసముద్రం వద్ద తిరుత్తణి వైపు వెళుతున్న చెరుకు ట్రాక్టర్ రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుకు పక్కనే వున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి గోడలు కూలి వస్తువులతో పాటు బైకు ధ్వంసమైంది. అయితే ఆ సమయంలో ఇంట్లో వున్న ఇంటి యజమాని మోహన్ అతని భార్య బిడ్డలకు ఎలాంటి గాయాలు కాకుండా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా దిగి మరో బస్సులో వెళ్లిపోయారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగం పేరిట మోసం
–ఒకరి అరెస్ట్
తిరువళ్లూరు: ప్రభుత్వ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.14.49 లక్షలు మోసం చేసిన వ్యవహారంలో ఒకరిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్ ప్రాంతానికి చెందిన రవికుమార్. ఇతడి తమ్ముడికి పశుసంవర్థక శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అదే ప్రాంతానికి చెందిన నాగరాజ్ రూ.14.49 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఆవడి పోలీసు కమిషనర్కు ఫిర్యాదు అందింది. పోలీసులు విచారణలో మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో నాగరాజ్ను అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.
శాస్త్రోక్తం.. త్రిశూల స్నానం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఆదివారం శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. మాఘ పౌర్ణిమను పురస్కరించుకుని మహాశివరాత్రికి ముందు త్రిశూల స్నానం జరిపించడం ఆనవాయితీ. అందులో భాగంగా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడితోపాటు త్రిశూలానికి విశేష పూజలు చేశారు. సద్యోముక్తి పురాణ ప్రవచనం తర్వాత త్రిశూల స్నానం నిర్వహించారు. అనంతరం ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. పంచమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు.
క్లుప్తంగా


