భానుపురి(సూర్యాపేట): ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని, జిల్లా, మండల స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 36 దరఖాస్తులు, డీపీఓకు 7, మున్సిపాలిటీకి 5, డీఎంహెచ్ఓకు 3, ఇతర శాఖలకు 19 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, జడ్పీ సీఈఓ శిరీష, సీపీఓ కిషన్, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీపీఓ యాదగిరి, డీడబ్ల్యూఓ నరసింహారావు, అధికారులు పాల్గొన్నారు.
విముక్త జాతుల అభ్యున్నతికి ప్రాధాన్యం
సమాజంలో అత్యంత వెనుకబడిన విముక్త జాతుల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం విముక్త జాతుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. విముక్త జాతుల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి గ్రామీణ స్థాయి నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి విడతల వారీగా లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధికారులతో పాటు బీసీ అభివృద్ధి అధికారి విశాల్, మాజీ ఎమ్మెల్యేలు దోసపాటి గోపాల్, కౌన్సిలర్ ఊరా రామ్మూర్తి, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


