అర్వపల్లి : తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాల్లో నూతనంగా నియమించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రెండున్నర ఏళ్లు కొనసాగుతారని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. అర్వపల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కొందరు సీనియర్లమంటూ పార్టీలో కిరికిరి చేస్తున్నారని, అలా చేస్తే కుదరదని చెప్పారు. వారంతా తనతో కలిసి వచ్చి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏచిన్న సమస్య వచ్చినా తనను కలువవచ్చని చెప్పారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని సీలింగ్ భూముల సమస్యను సీఎంతో మాట్లాడి పరిష్కరించి 2వేల ఎకరాల భూములకు పట్టాలిప్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.5వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. సభలో డీసీసీ కార్యదర్శులు ఇందుర్తి వెంకట్రెడ్డి, వేల్పుల రమేష్, బీరవోలు విక్రంరెడ్డి, మాజీ జడ్పీటీసీ అవిలయ్య, దాసరి సోమయ్య, జీడి వీరస్వామి, మూసీ ప్రాజెక్టు చైర్మన్ అలువాల వెంకటస్వామి, ఏఎంసీ డైరెక్టర్లు సైదులు, జలేంధర్, దల్వాయి శ్రీధర్, చిక్కుల శేఖర్, విక్రం, సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
సీనియర్లమంటూ కిరికిరి చేస్తే కుదరదు
ఎమ్మెల్యే మందుల సామేల్


