భానుపురి (సూర్యాపేట) : చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. చాలాకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందించేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రస్తుతం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికుల నుంచే దరఖాస్తులు తీసుకుంటోంది. 58 ఏళ్లు నిండిన వారికి అవకాశం ఇవ్వకపోవడంతో చాలా మంది నిరాశ చెందారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 17,334 దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించారు. దరఖాస్తులు సమర్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది.
ఇప్పటి వరకు దాఖలైన దరఖాస్తులు ఇలా..
జిల్లాలోని 23 మండలాలు, ఐదు మున్సిపాలిటీల నుంచి మొత్తం 17,334 దరఖాస్తులు అధికారులకు ఆన్లైన్లో అందాయి. ఇందులో అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీ నుంచి 2,038 రాగా అత్యల్పంగా పాలకవీడు మండలం నుంచి 260 దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్లో అందిన దరఖాస్తుల్లో అత్యధికంగా వితంతు పెన్షకు 9,302 ఉన్నాయి. దివ్యాంగ కేటగిరి నుంచి 4,110 దరఖాస్తులు, కల్లుగీత కార్మికుల నుంచి 2,424, ఒంటరి మహిళల నుంచి 1,171, చేనేత పెన్షన్ల కోసం 327 మంది దరఖాస్తు చేసుకున్నారు.
పరిశీలన తర్వాతే మంజూరు
కొత్త పింఛన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ ఆన్లైన్లో దరఖాస్తుకు ఆప్షన్ అందుబాటులో లేకపోవడంతో చాలామంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం కొత్త పింఛన్ల ప్రక్రియను ప్రారంభించడంతో ఆయా కేటగిరీలకు చెందిన వారు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దరఖాస్తు చేసి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. దరఖాస్తుదారుల అర్హత, ధ్రువపత్రాలు, కుటుంబ పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందిస్తారు. అనంతరం సంబంధిత డేటాబేస్లతో వివరాలను ధ్రువీకరించి జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛన్లు మంజూరు చేయనున్నారు. దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుండగా.. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు 17,334
దరఖాస్తులు
ఐదు కేటగిరీలకే అవకాశం
వితంతు పెన్షన్లకు అత్యధికంగా
దరఖాస్తులు


