ఉగాది నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఉగాది నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఎండీ మాట్లాడుతూ.. జిల్లాలో స్లాబ్ దశలో, సగం వరకు పూర్తయిన 2700 ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేసి ఉగాది నాటికి లబ్ధిదారులకు అందించే విధంగా సిద్ధం చేయాలని సూచించారు. పూర్తయిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలన్నారు. పెండింగ్ పనులైన అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటి, డ్రింకింగ్ వాటర్ మొదలైన పనులను పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సూర్యాపేట తహసీల్దారు కృష్ణయ్య, హౌసింగ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ ఎండీ గౌతమ్ కోరారు. మంగళవారం కోదాడకు వెళ్లి వస్తూ మార్గమధ్యంలో చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామంలో కొద్దిసేపు ఆగారు. ఇంటి బిల్లులకు సంబంధించి నగదు సకాలంలో వస్తున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఉన్నారు.
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్


