యాప్ వద్దంటూ రైతుల ఆందోళన
పెన్పహాడ్ : ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ వద్దంటూ..పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ గ్రామాల రైతులు శుక్రవారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని చీదెళ్ల పీఏసీఎస్ కార్యాలయ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పీఏసీఎస్ చీదెళ్ల కార్యాలయానికి 444 యూరియా బస్తాలు రావడంతో అధికారులు యాప్లో అప్లోడ్ చేశారు. దీంతో 97మంది రైతులు 444 బస్తాలను 30 సెకన్లలో బుకింగ్ చేసుకోవడంతో యూరియా అయిపోయింది. యాప్లో స్టాక్ చూపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి ఏఓ అనిల్కుమార్, పీఏసీఎస్ సిబ్బంది వచ్చి యూరియా మంజూరు కాగానే రైతులకు వెంటనే తెలియజేస్తామని పేర్కొన్నారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
ఖానాపురం పీఏసీఎస్ వద్ద..
అనంతగిరి : యూరియా బుకింగ్ చేసుకునేందుకు యాప్పై అవగాహన లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గతంలో మాదిరిగా పీఏసీఎస్ పరిధిలోని రైతులకే నేరుగా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతగిరి మండలం గోండ్రియాల క్లస్టర్లోని ఖానాపురం పీఏసీఎస్కు వచ్చిన యూరియా స్టాక్ను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన నిమిషం వ్యవధిలోనే స్టాక్ అయిపోవడంతో రైతులు ఆగ్రహించి పీఏసీఎస్ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. దీంతో కార్యాలయ సిబ్బంది యాప్లో బుక్ చేసుకున్న రైతులకు సైతం యూరియా అందించకుండానే వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న అనంతగిరి తహసీల్దార్ హిమబిందు, ఎస్ఐ నవీన్ కుమార్ సాయంత్రం 4 గంటలకు కేంద్రానికి చేరుకుని బుకింగ్ చేసుకున్న 74 మంది రైతులకు యూరియా అందించారు. 20 మంది రైతులకు మరుసటి రోజు ఇస్తామని చెప్పారు. ఈ విషయమై ఏఓ అందె సతీష్ను వివరణ కోరగా యూరియా కొరతపై ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని రైతులకు తెలిపానని పేర్కొన్నారు.


