ఎకనాలెడ్జ్మెంట్ ఫారం ఉంచడం లేదు
గార మండలం చల్లపేట గ్రామంలో ఓటర్లకు ఎకనాలెడ్జ్మెంట్ ఫారం ఇవ్వడం లేదు. రెండు ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్ఓనే తీసుకుంటున్నారు. అడుగుతుంటే తర్వాత ఇస్తామని చెబుతున్నారని ఓటర్లు చెబుతున్నారు.
– సావాడ ధర్మారావు, చల్లపేట, గార మండలం
మా ఇంటికి ఎవరూ రాలేదు
గతంలో సింగుపురం గ్రామంలోనే ఉండేవాళ్లం. ఇప్పుడు ప్రశాంత్ నగర్ కాలనీకి మారిపోయాం. మా ఇంటికి బీఎల్ఓలు రాలేదు. ఏడు ఓట్లు మా ఇంటిలో ఉండగా ఒక్కరికీ ఫారాలు పంపిణీ చేయలేదు. – వారణాశి శమంతకమణి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్).. అంకెలు అంతుచిక్కడం లేదు. ఫారాలు పంపిణీ ముమ్మరంగా జరుగుతోందని సిబ్బంది చెబుతున్నారు. అసలు తమకు ఫారాలే ఇవ్వలేదని చాలా మంది గ్రామస్తులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫారాల పంపిణీ, స్వీకరణకు మరో 10 రోజుల వ్యవధి ఉంది. జిల్లాలో ఇప్పటికే 98.24 శాతం మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తయినట్టు చూపిస్తున్నారు. మొత్తం ఓటర్లు 18,97,405 మంది ఉండగా, 18,64,016 మందికి పంపిణీ చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు ఇవి కాకి లెక్కలని తేటతెల్లం చేస్తున్నాయి.
అర్బన్లో ఇలా..
● జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో కార్యక్రమం దారుణంగా జరుగుతోంది.
● చాలా ఏరియాల్లో బీఎల్ఓలు అడుగే పెట్టలేదు.
కానీ, ఆ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పంపిణీ చేసినట్టు చూపిస్తున్నారు.
● శ్రీకాకుళం నగరంలోని పీఎన్కాలనీ, గైనేటివీధి, ఆదిత్యానగర్ కాలనీ తదితర ప్రధాన ప్రాంతాల్లో కనీసం ఇళ్లను సందర్శించలేదు.
వీరి పరిస్థితి ఏమిటో..?
● శ్రీకాకుళం నగరంలోని గైనేటి వీధిలో నివాసముంటున్న కె.సంతోషి 2024ఎన్నికల్లో ఓటు వేశారు. కానీ, తాజాగా చేపడుతున్న సర్ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదు.
● శ్రీకాకుళం నగరంలోని గైనేటి వీధిలో నివాసముంటున్న గొర్లె జనార్ధరావు ఫ్యామిలీకి కూడా ఫారాలు ఇవ్వలేదు. వారికే కాదు ఆ కాంపౌండ్లో మిగతా వారికి ఫారాలు పంపిణీ చేయలేదు.
● శ్రీకాకుళం నగరంలోని పీఎన్కాలనీలోని రెండో వీధిలో ఉంటున్న కె.నాగమణి.. కుటుంబంలోని మిగతా ఓటర్లకు కూడా ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదు.
● సారవకోట మండలం కూర్మనాథపురం గ్రామంలో 528ఓట్లకు గాను 200మందికి పైగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదు.
● శ్రీకాకుళం రూరల్లోని సింగపురం పరిధిలోని 150 ఇళ్లు ఉన్న దుబలరాయి కాలనీలో ఇంతవరకు బీఎల్ఓలు సందర్శించిన దాఖలాల్లేవు.
ఫారాల పంపిణీలో వివక్ష
ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ, స్వీకరణ విషయంలో కూడా పలుచోట్ల వివక్ష చూపిస్తున్నారు. ఇంట్లో ఐదుగురు ఉంటే నలుగురికి ఇవ్వడం, మిగతా వారికి ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ దాట వేస్తున్నారు. స్వీకరణ విషయంలో మతలబు జరుగుతోంది. ఓటర్ వద్ద ఎకనాలెడ్జ్మెంట్గా ఒకఫారం ఉంచాల్సింది పోయి.. ఆ ఫారం కూడా తీసుకుని తమ చేతుల్లో కొందరు బీఎల్ఓలు పెట్టుకుంటున్నారు. రెండు ఫారాలు బీఎల్ఓలే తీసుకుంటే భవిష్యత్లో ఓటు గల్లంతై ఏమీ అడగలేని పరిస్థితిలో ఓటర్లు ఉంటారు.
ఎన్యుమరేషన్ ఫారాలు
పంపిణీ శాతం
నియోజకవర్గాల వారీగా
శ్రీకాకుళం 97.63
ఇచ్ఛాపురం 97.65
ఎచ్చెర్ల 98.34
పలాస 96.25
టెక్కలి 97.31
ఆమదాలవలస 99.89
పాతపట్నం 99.06
నరసన్నపేట 99.88
మ్యాపింగ్ కాని ఓట్లు 2,50,627
పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు 18,64,016
పంపిణీ శాతం
98.24 శాతం
డిజిటలైజ్డ్ ఎన్యూమరేషన్ ఫారాలు 9,85,170
జిల్లాలో మొత్తం ఓట్లు 18,97,405
మ్యాపింగ్ అయిన ఓట్లు 16,46,778
ఈ లెక్కల్లో
వాస్తవమెంత?
అంతుచిక్కని ‘సర్’ అంకెలు
అధికారుల నివేదికలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు కుదరని పొంతన
98.24 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్టు నివేదికలు
చాలాచోట్ల ఇంకా జరగని పంపిణీ
మరో పది రోజులే వ్యవధి
ఓటర్ దగ్గర ఎకనాలెడ్జ్మెంట్ ఫారం లేకుండా చేస్తున్నారని ఆరోపణలు


