ఎచ్చెర్ల : పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించే ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, విద్యార్థి దశ నుంచే దీనిపై అవగాహన కలిగి ఉండాలని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ గిరిధర్ మద్రాస్ అన్నారు. శుక్రవారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ వంటి క్యాంపస్లలో ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారని, ఇక్కడ కూడా ప్లాస్టిక్ సంచులు, బాటిళ్ల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏవో శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్ ప్రకాశరాజు, పెద్దింటి ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.


