ఎలా వచ్చాయో..
మెళియాపుట్టి: పరశురాంపురం పంచాయతీ పరిధి లోని తూముకొండ రామచంద్రాపురం (టీకేఆర్ పురం), రంగడిఘాటి, పరశురాంపురం తదితర గ్రామాల్లో కొద్దిరోజుల క్రితం వందల సంఖ్యలో కోతులు, వానరాల పిల్లలు సంచరిస్తుండేవి. ఎక్కడ చూసినా ఇవే కనిసిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఈ విషయమై సాక్షిలో పలుమార్లు ‘వామ్మో వానరాలు’ పేరిట కథనాలు ప్రచురితం కావడంతో అటవీశాఖ అధికారులు స్పందించారు. గ్రామంలోని కోతుల ను కొంచెంకొంచెంగా పట్టుకుని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడంతో ప్రస్తుతం వాటి బెడద తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో చుట్టుపక్కల ఉన్న పోడు వ్యవసాయ పంటలు, కూరగాయల పంటలను కోతలు నాశనం చేసేవని, చిన్నపిల్లలను వెంబడిస్తూ ఇబ్బందిపెట్టేవని, ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.
అకస్మాత్తుగా వందల సంఖ్య లో కోతులు మా గ్రామ పంచాయతీలో కనిపించాయి. ఎలా వచ్చాయో.. ఎవరు తెచ్చి విడిచిపెట్టారో తెలీదు. అప్పటి నుంచి ఫారెస్ట్ అధికారులు, తహసిల్దార్ దృష్టిలోకి తీసుకెళ్లాం. ఈ విషయమై ‘సాక్షి’లో కథనాలు ప్రచురితం కాగానే అధికారు లు స్పందించి కొద్దిరోజుల క్రితమే కోతులను తరలించారు. అరకొరగా మిగిలి ఉన్న వాటిని కూడా తరలించాలి.
–తెంబూరు ప్రసాదరావు,
తాజా మాజీ సర్పంచ్, పరశురాంపురం


