శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి బుధవారం వివిధ శాఖల ప్రగతిపై మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక సరఫరా, విద్యుత్ సేవలు వంటి అంశాల్లో ప్రజా సంతృప్తి శాతం ఆశించిన స్థాయిలో లేదని, క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వీటిని తక్షణమే మెరుగుపరచాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందే అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


