ఆమదాలవలస: తాగునీటి పైపులైన్లకు మరమ్మతుల పేరిట లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టమ్మ క్వార్టర్స్, గేటు ప్రాంతం, మేదర వీధి, పాత ఆమదాలవలసకు వెళ్లే పైపులైను లీకేజీ కారణంగా నీరు కలుషితమవుతోంది. మెట్టక్కివలస నుంచి పాత ఆమదాలవలసకు వచ్చే పైపులైను రైల్వే ట్రాక్ కల్వర్టు కింద పూర్తిగా పాడై మురుగునీటిలో కూరుకుపోయింది. బీఆర్ నగర్ రోడ్డు వద్ద నిరంతర లీకులతో దాదాపు పైపులు పూర్తిగా పాడైపోయాయి. దీంతో నీరు కలుషితమై ఆయా ప్రాంతాల్లో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. సంపులు, ట్యాంకర్లలో ఎప్పటికప్పుడు మట్టిని తొలగించకపోవడం వల్ల తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి.


