ఇచ్ఛాపురం రూరల్/ఇచ్ఛాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కక్షపూరిత దాడులతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు భరోసా ఇచ్చారు. మంగళవారం ఎంపీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తరచూ కార్యకర్తలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు నిలుపుదల, అధికారులతో ఒత్తిడికి గురి చేస్తున్నారని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రామారావు, విజయ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని, కూటమి ప్రభుత్వం మాత్రం సొంత కార్యకర్తలకు పెద్దపీట వేయడం దారుణమన్నారు. ఈ విధానాలపై ప్రతిఒక్క కార్యకర్త గళమెత్తాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల మశాఖపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కె.భీమారావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేయడంతో మంగళవారం బాధితుడిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, వివక్షలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ ఎం.చిన్నంనాయుడికి వినతిపత్రం అందించారు. రౌడీషీట్లు ఓపెన్చేస్తామని బెదిరిస్తున్నారని, మహిళలతో అగౌరవంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మండల పార్టీ కన్వీనర్ పాతిర్ల రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీపీ బోర పుష్ప, సీడాప్ మాజీ చైర్మన్ సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, వైస్ ఎంపీపీ దువ్వు వివేకానందరెడ్డి, మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, సల్ల దేవరాజు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.