ఆ లేఖ ఉంటేనే బదిలీ, ఆ లేఖ ఉంటేనే పోస్టింగు, ఆ లేఖ ఉంటేనే అన్ని పనులు. కూటమి ప్రభుత్వం తన రూటే సెప‘రేటు’ అనిపించుకుంటోంది. ఉద్యోగుల బదిలీకి ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను తప్పనిసరి చేసింది. దీంతో అధికారులు, ఉద్యోగులు ఆపసోపాలు పడుతున్నారు. కోరుకున్న చోటుకు వెళ్లడానికి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఆమదాలవలస అంటే మాత్రం హడలిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల్లో సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతోంది. ఉద్యోగుల బదిలీల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా సిఫార్సు లేఖల సంస్కృతిని తెరపైకి తెచ్చింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈనెల 20వ తేదీన జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (ఉపాధి హామీ) పథకంలో పనిచేస్తున్న ఎపీఓ, ఇంజినీరింగ్ కన్సల్టింగ్ (ఈసీ), టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ), కంప్యూటర్ ఆపరేటర్లు (సీఓ) తదితర ఉద్యోగుల బదిలీలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ ఈ బదిలీల్లో ఎమ్మెల్యేలు కలుగజేసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే మీరు కోరుకున్న చోటు లభిస్తుందని డ్వామా అధికారులు చేతులేత్తేయటంతో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు గత ఐదు రోజులుగా జిల్లాలోని ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు చేయాల్సిన బదిలీలను ఎమ్మెల్యేలు చేతుల్లోకి తీసుకున్నారని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.
ఒక ఉద్యోగి.. మూడు మండలాలు
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీఓలు ఇప్పుడు పనిచేస్తున్న క్లస్టర్లో ఉండకూడదని పక్క క్లస్టర్కు వెళ్లాలని, ఈసీ, టీఏ, సీఓ వంటి మిగిలిన ఉద్యోగులు వారి సొంత మండలాల్లో ఉండకుండా పక్క మండలాలకు వెళ్లాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగి వారికి నచ్చిన మూడు మండలాలను ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. దీంతో ఉద్యోగులు వారికి నచ్చిన మూడు మండలాలను ఎంపిక చేసుకుని డ్వామా అధికారులకు వారి అంగీకారాన్ని తెలియజేశారు. బదిలీలు సజావుగా జరిగిపోతాయనుకున్న సమయంలో ఎమ్మెల్యే సిఫార్సు లేఖ అంటూ సరికొత్త సంస్కృతి తెరమీదకు రావటంతో రాజకీయ నాయకులతో పాటు ఎమ్మెల్యేల కార్యాలయాలు చుట్టూ ఉద్యోగులు తిరుగుతున్నారు.
ఆమదాలవలస అంటే హడల్..
జిల్లాలో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం ఉద్యోగుల్లో ఒక భయం వెంటాడుతోంది. ఆమదాలవలస నియోజకవర్గం అంటే హడలిపోతారు. అక్కడ పనిచేయాలంటే భయమని చెబుతారు. ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ఎక్కడ పనిచేసినా చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేస్తారని, ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తమను దోషులుగా నిలబెడతారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే పోస్టింగ్
డ్వామా బదిలీల్లో సరికొత్త సంస్కృతి
ఎమ్మెల్యే లేఖ తప్పనిసరి అంటున్న అధికారులు
అధికారుల తీరుతో ఉపాధి హామీ ఉద్యోగుల్లో ఆందోళన
ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న ఉపాధి ఉద్యోగులు