పలాస: మధ్య భారతదేశంలో ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరపాలని, ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని, అడవులు ఆదివాసీ గూడేల్లో ఏర్పాటు చేసిన పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని ప్రజాతంత్ర ఉద్యమ వేదిక (పి.డి.ఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పలాస మండలం మాకన్నపల్లిలో భగత్సింగ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా స్వాతంత్య్రోద్యమ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పి.డి.ఎం. జిల్లా అధ్యక్షుడు జె.వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి వీరులు దోపిడీ రహిత సోషలిస్టు సమాజం నిర్మాణం కోసం కలలు గన్నారని, నేడు ఆ కలలు కల్లలయ్యావని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆఽశలు ఆశయాలు నేటికి ఇంకా మిగిలే ఉన్నాయని, వారి తోవలోనే దండకారణ్యంలో ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. అయితే పాలకవర్గాలు ఆ పోరాటాన్ని అణిచివేయాలని కగార్ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి పథకం రచించారని, వాటిని పౌర సమాజం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కె.ఎన్.పి.ఎస్.రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, డి.టి.ఎఫ్ జిల్లా నాయకుడు డి.ధర్మారావు, చింతాడ ధర్మారావు, ఎం.ధర్మారావు(పి.కె.ఎస్), జోగి కోదండం, మద్దిల వినోద్కుమార్(పి.డి.ఎస్.యు), తెప్పల అజయ్, కృష్ణమూర్తి, నాగమణి, వీరాస్వామి, లక్ష్మణ్, పి.దానేసు తదితరులు పాల్గొన్నారు.