బీసీలపై ప్రభుత్వానికి వివక్ష | - | Sakshi
Sakshi News home page

బీసీలపై ప్రభుత్వానికి వివక్ష

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్‌

అనంతపురం: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని, ఎలాంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలు దక్కకుండా చంద్రబాబు ప్రభుత్వం వివక్షకు గురిచేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌గౌడ్‌ విమర్శించారు. ఈ నెల 26న అనంతపురంలో తలపెట్టిన ‘బీసీ గళం’ కార్యక్రమం విజయవంతం చేయడానికి గల కార్యాచరణపై సోమవారం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 26న జరగబోయే బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీ వర్గాలకు ఆర్థిక స్వావలంబన, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ద్వారా సామాజిక సాధికారిత దిశగా గత వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాటలు వేశారని గుర్తు చేశారు. బీసీలను చంద్రబాబు బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌గా భావిస్తే.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌గా వైఎస్‌ జగన్‌ మార్చారని ప్రశంసించారు. అమ్మ ఒడి పథకం, విద్యాదీవెన, విద్యా కానుక, పొదుపు మహిళలకు ఆసరా, అక్క చెల్లెమ్మలకు చేయూత లాంటి పథకాలను దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అమలు చేసి అన్ని విధాలుగా అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న (న్యాయవాది), రాధాకృష్ణ, బీసీ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర, ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, బీసీ సెల్‌ నగర కార్యదర్శి నరేష్‌, శ్రీనివాసులు, రిలాక్స్‌ నాగరాజు, శేఖర్‌ బాబు, రాజశేఖర్‌, నవీన్‌, లక్ష్మణ్‌, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, రాజేష్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌, కై లాష్‌, చిన్న రాయుడు, ఎం. కిరణ్‌, దస్తా వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

28 నుంచి పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు

మే 6న బ్రహ్మ రథోత్సవం

ఉరవకొండ రూరల్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. మే ఆరో తేదీ బ్రహ్మ రథోత్సవం (తేరు) జరగనుంది. బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఈఓ సాకే రమేష్‌బాబు, ఆలయ కమిటీ చైర్మన్‌ రేగాటి నాగరాజు, ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. ఈఓ మాట్లాడుతూ ఈ నెల 28న ఆమిద్యాల నుంచి ఉత్సవమూర్తులను పెన్నహోబిలం క్షేత్రానికి తీసుకురావటంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయన్నారు. 29న ప్రాకారోత్సవం, 30న ఉదయం సింహ వాహనోత్సవం, సాయంత్రం చంద్రప్రభ వాహనోత్సవం, మే 1న ఉదయం గోవాహనోత్సవం, సాయంత్రం శేష వాహనోత్సవం, 2న హంస వాహనోత్సవం, 3న హనుమద్‌ వాహనోత్సవం, 4న గరుడ వాహనోత్సవంతో పాటు స్వామి వారి కల్యాణోత్సవం, 5న ఉదయం సూర్యప్రభ వాహనోత్సవం సాయంత్రం ఐరావత వాహనోత్సవం ఉంటుందన్నారు. 6న బ్రహ్మ రథోత్సవం, 7న అశ్వ వాహనోత్సవం, 8న ధ్వజారోహణ, 8న శయనోత్సవం, 9న ఉత్సవమూర్తులను తిరిగి ఆమిద్యాల గ్రామానికి చేర్చటంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

రౌడీ షీటర్లు, గంజాయి విక్రేతల అరెస్ట్‌

కదిరి టౌన్‌: పట్టణంలోని ముగ్గురు రౌడీషీటర్లతో పాటు గంజాయి మత్తులో పదేపదే గొడవలు చేస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో పట్టణ పీఎస్‌ పరిధిలో రౌడీ షీటర్లుగా ఉన్న గాలివీడు కళ్యాణ్‌, పవన్‌కుమార్‌, ప్రదీప్‌సింగ్‌తో పాటు గంజాయి మత్తులో గొడవలకు పాల్పడుతున్న నంద్యాల జస్వంత్‌, పఠాన్‌ ముబీన్‌ అహమ్మద్‌ ఖాన్‌, ఇడగొట్టు గణేష్‌ ఉన్నారు. వీరి నుంచి 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement