135 సెల్‌ఫోన్ల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

135 సెల్‌ఫోన్ల స్వాధీనం

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

పుట్టపర్తి టౌన్‌: వివిధ కారణాలతో ప్రజలు పోగొట్టుకున్న 135 సెల్‌ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని సంబంధీకులకు ఎస్పీ అందజేసి, మాట్లాడారు. సెల్‌ఫోన్లను వీలైనంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. మొబైల్‌ ఫోన్‌ కేవలం వస్తువుగా మాత్రమే చూడకుండా వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, జ్ఞాపకాలతో కూడిన విలువైన పేటికగా గుర్తించాలన్నారు. అందులో మీకు సంబంఽధించిన ముఖ్యమైన డేటా ఉంటుందనే విషయాన్ని మరవకూడదన్నారు. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే రికవరీ సులభతరం అవుతుందన్నారు. కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తక్కువ ధరకు వస్తున్నాయని ఆశ పడి ఎలాంటి బిల్లులు లేని పాత ఫోన్లను కొనుగోలు చేయరాదని సూచించారు. బిల్లులు లేకుండా కొనగోలు చేసే ఫోన్లు దొంగలించనవి అయ్యే అవకాశం ఉంటుందని, అలాంటి ఫోన్ల వాడకం వల్ల అనవపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సెల్‌ఫోన్ల రికవరీలో చొరవ చూపిన సిబ్బందిని అభినందించారు.

ఊరు వెళ్తున్నారా జాగ్రత్త

వేసవి సెలవుల నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు. ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటి ముందు, వెనుక భాగం దృఢమైన గేట్లు అమర్చుకోవాలన్నారు. సెలవుల్లో బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెద్ద మొత్తం నగదు, బంగారం ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా సీసీఎస్‌, ఐటీకోర్‌, సైబర్‌ క్రైమ్‌ సీఐలు గోపీనాథరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, సతీష్‌కుమార్‌, సిబ్బంది కృష్ణానాయక్‌, నరసింహమూర్తి, శ్రీనివాసులు, చంద్ర, షామీర్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిష్కార వేదికకు 75 వినతులు

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 75 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌ కుమార్‌ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఆంకిత సురానా, లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథరెడ్డి, సీఐ బొజ్జప్ప పాల్గొన్నారు.

సంబంధీకులకు అందజేసిన ఎస్పీ సతీష్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement